తెలుగుయూనివర్సిటీ: దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు.మాదిగ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో దళితబంధు పథకం సద్వినియోగం అనే అంశంపై శుక్రవారం సాయంత్రం రెడ్హిల్స్లో గల ఫ్యాప్సీ ఆడిటోరియంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గువ్వల బాలరాజు మాట్లాడుతూ పేద దళితులకు ఈ పథకం ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందు చూపుతోనే దళిత సమాజానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. దళితుల సంక్షేమానికి సిఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడాలేవని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేయకపోగా విమర్శించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. అణగారిన వర్గాలకు కొత్త వెలుగులు చూపుతున్న సిఎం కేసీఆర్ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
సామాజిక కోణంలో ఆలోచించి ప్రతిపక్షాలు కూడా దళితుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను హర్షించాలని ఈ కోవలోనే భట్టి విక్రమార్క, జీవన్రెడ్డి, సర్వే సత్యనారాయణ తదితర నేతలు హర్షించే ప్రకటనలు తాము స్వాగతిస్తున్నట్లు టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు అన్నారు. ఎంఐసిసిఐ ఛైర్మన్ మహేష్, అధ్యక్షులు రాజ్కుమార్, నాయకులు జంగా సుదర్శన్, బి. నరసింలు, నరసింహారావు, అన్నపూర్ణ, భాస్కర్, మోహన్నాయక్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.