న్యూఢిల్లీ: దేశంలోని కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ మరోసారి విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా.. యూపీలో ఒక జిల్లాలోని సిటీ సివిల్ కోర్టుకు బిల్డింగ్ కూడా లేదని న్యాయవాది ఎంఎల్ శర్మ సీజేఐ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన జస్టిస్ రమణ ‘అదొక్కటే కాదు, దేశంలోని అనేక జిల్లాల్లో కోర్టులకు భవనాలు లేవు. ఏం చేయాలి! కేంద్రాన్ని అడిగాం. ఈ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూలేఖ రాశాను. నివేదిక కూడా సమర్పించాను’ అని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కొరతపై పిల్ దాఖలు చేయాలని న్యాయవాదికి సూచించారు.