సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ )అమీర్పేట్: రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిసున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రైతులకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మహాధర్నాకు కేంద్రం దిగొచ్చిందని చెప్పారు. ఇందిరాపార్ ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆందోళన ఉధృతం అవుతుందనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకున్నదని మంత్రి తలసాని స్పష్టం చేశారు. ఆరు నెలలుగా రైతులు అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారని, ఎంతో మంది రైతులు మరణించారని తెలిపారు. రైతే రాజు అన్న నినాదాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో 24 గంటలు ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇస్తూ ప్రోత్సహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తాం..
బాయిల్డ్ రైస్, రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హకులు, చట్టాలను తుంగలో తొకే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని తలసాని హితవు పలికారు. బీజేపీ నేతలు ఏది పడితే అది మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాధించిన దాఖలాలు చరిత్రలో లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇష్టమొచ్చినట్లు తిడతామంటే కుదరదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు మేలు చేసే విధంగా సంసరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్రెడ్డి, గుర్రం పవన్కుమార్ గౌడ్, హన్మంతరావు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేష్ రాజు, నాయకులు లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీహరి, సురేష్ గౌడ్, అబ్బాస్, ఫహీం, ఉమానాథ్ గౌడ్ పాల్గొన్నారు.
అన్నదాతల విజయమిది..
హిమాయత్నగర్, నవంబర్ 19: రైతు ఉద్యమాలతో కేంద్రం తలొగ్గి నల్లచట్టాలను ఉపసంహరించుకున్నదని పలువురు వక్తలు అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్లోని మఖ్ధుం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ కన్వీనర్లు పశ్య పద్మ, టి.సాగర్, కన్నెగంటి రవి, సినీ నటుడు,దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడారు. ఏడాది పాటు సాగిన ఉద్యమంపై నిరంకుశంగా వ్యవహరించిన ప్రధాని మోడీ చివరకు తల వంచారన్నారు. పంటల మద్దతు ధర, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఉద్యమం ఆపేది లేదన్నారు. సమావేశంలో నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, కిరణ్, రంగయ్య, ధర్మపాల్ కృష్ణ, కాంతయ్య పాల్గొన్నారు.
చేసిన పాపం అనుభవించాలి..
రైతన్నలకు సంఘీభావంగా సీఎం కేసీఆర్ చేపట్టిన మహాధర్నాతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా చూసుకుంటున్నా ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయి. అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న వారికి మహాధర్నా ఓ గుణపాఠంగా మారింది. రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం తగిన మూల్యం చెల్లించకోక తప్పదు. భవిష్యత్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
మహాధర్నా సెగ ఢిల్లీకి తగిలింది..
వడ్లు కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ చేపట్టిన మహాధర్నా సెగ ఢిల్లీకి తగిలింది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రధాని మోడీ నల్ల చట్టాలను రద్దు చేశారు. తెలంగాణలో పండుతున్న మొత్తం ధాన్యాన్ని కేంద్రం వెంటనే కొనుగోలు చేయాలి.
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర రైతుల పక్షాన సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హైదరాబాద్లో చేపట్టిన ధర్నాతోనే కేంద్రానికి కనువిప్పు కలిగింది. దక్షిణాది రాష్ర్టాల్లో రైతు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడే ప్రమాదముందని గ్రహించిన కేంద్రం వెనక్కి తగ్గింది.