కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ తన సత్తాను చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలపై జెండా ఎగురవేసింది. సిరిసిల్ల, జమ్మికుంట, రాయికల్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న ఆ పార్టీ, అత్యంత ఉత్కంఠ రేపిన కరీంనగర్ కార్పొరేషన్ పదవుల ఎన్నికల్లో హుందాగా వ్యవహరించింది. హస్తం పార్టీకి మద్దతు ఇస్తుందంటూ వివధ రకాలుగా ప్రచారం జరిగినా ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా నిలబడింది. ఈ కార్పొరేషన్లో పాగా వేసేందుకు చివరి వరకు ప్రయత్నం చేసిన కాంగ్రెస్, చివరకు అబాసుపాలైంది. కాగా, అత్యధిక కార్పొరేటర్ స్థానాలను గెలుచుకున్న బీజేపీ మొదటిసారి కరీంనగర్ను కైవసం చేసుకున్నది. మెట్పల్లిలో కాంగ్రెస్, బీజేపీ బంధం బయటపడింది. హస్తం పార్టీకి బీజేపీ మద్దతు తెలుపడం చర్చనీయాంశమైంది.
ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ఆయా పార్టీలో అష్టకష్టాలు పడ్డా, విప్ను దిక్కరించి క్రాస్ ఓటింగ్ చేసిన కౌన్సిలర్పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదంటూ అధికారులు చెప్పడంతో అసలు విషయం తెలిసిన నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు ధర్మపురి మున్సిపాలిటీలో హస్తం పార్టీ చైర్మన్ పదవిని ఒకరికి రెండేళ్లు, మరొకరికి మూడేళ్లు ఇవ్వడంతో రాజీ కుదిరింది. జగిత్యాలలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్మన్ ఎన్నిక వరకు మాజీ మంత్రి జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్కుమార్ మధ్య ఆధిపత్య పోరు నడిచినా.. చివరకు అధిష్టానం సంజయ్కే మొగ్గు చూపింది.
జీవన్రెడ్డి ప్రతిపాదనలు బుట్టదాఖలు చేసినట్టు తెలిసింది. దీనిపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం వైస్ చైర్పర్సన్గా జీనత్ పర్వీన్కు అవకాశం కల్పించగా, ఆయన భర్త మాజీ కౌన్సిలర్ మున్నా ససేమిరా అన్నారు. నేరుగా జీవన్రెడ్డిని కలిసి విషయం చెప్పారు. ‘మీకు గుర్తింపు ఇవ్వకుండా నాకు పదవి అవసరం లేదు’ అని చెప్పారు. అవసరమైతే కౌన్సిలర్ పదవికి సైతం రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. చివరకు జీవన్రెడ్డి నచ్చచెప్పడంతో జీనత్ పర్వీన్తో నామినేషన్ వేయించగా, వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అలాగే, చైర్పర్సన్ పదవిని ఆశించిన కౌన్సిలర్ అడువాల జ్యోతి చైర్పర్సన్ అభ్యర్థి వాణికి చేయి ఎత్తి మద్దతు తెలుపకపోవడం చర్చనీయాంశమైంది.
ఇక వేములవాడలో కాంగ్రెస్ కౌన్సిలర్లకు జారీ చేసిన విప్ బీజేపీ నాయకుల చేతికి చిక్కింది. అక్కడ రెండు పదవులను కూడా ఒకే కాపు వర్గానికి కేటాయించగా, ఆది శ్రీనివాస్ తీరుపై ఇతర సామాజిక వర్గాల్లో ఆవేదన కనిపించింది. అలాగే, చైర్మన్ పదవిని ముగ్గురు ఆశించిచడంతో రెండున్నరేళ్ల కాలపరిమితి విధించినట్టు తెలిసింది. దీనిపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. మొత్తంగా చూస్తే.. సుల్తానాబాద్లో కోరెం లేక ఎన్నిక వాయిదా పడగా, మిగతా 12 మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లలో కొత్త పాలకవర్గాలు కొలువుతీరాయి.