రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన యోధ స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన ఉద్యమాలు సామాజిక దురాఘతాలు, మహిళా సమస్యలపై ఉక్కుపిడికిలి తుంగతుర్తి ఎమ్మెల్యేగానూ సేవలు నేడు నల్లగొండలో అంతిమయాత్ర.. మెడికల్ కాలేజీకి పార్ధివదేహం మంత్రి జగదీశ్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, కర్విరాల కొత్తగూడెం నిప్పుకణిక, ఉద్యమాల బెబ్బులి మల్లు స్వరాజ్యం అస్తమయం ఉమ్మడి నల్లగొండ జిల్లాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పేదల పక్షాన నిలిచి, వెట్టికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రజాకార్ మూకలకు తుపాకీ గురిపెట్టిన ధీర వనిత స్వరాజ్యం. పదేండ్ల వయస్సులోనే పోరుబట్టిన ఆమె లాఠీలకు, తూటాలకు వెరువక ఎనిమిది పదుల ప్రజా జీవితంలో ఎన్నో సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. మహిళా ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు ఎమ్మెల్యేగా గెలిచి సేవలందించారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న స్వరాజ్యం శనివారం రాత్రి హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నల్లగొండలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆమె భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు అంతిమ యాత్ర నిర్వహించి, నల్లగొండ మెడికల్ కాలేజీకి పార్థివదేహాన్ని అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మహిళా ఉద్యమాల దిక్సూచి, సీపీఎం మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం(91) ఇక లేరు. కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతూ శనివారం సాయంత్రం హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. మల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కర్విరాల కొత్తగూడెంలో 1931లో జన్మించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి ఐదో తరగతి చదివిన ఆమె అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి అడుగుజాడల్లో సాయుధ పోరాట బాట పట్టారు. అప్పటికే ఆంధ్ర మహాసభ పిలుపుతో పోరాటం కొనసాగిస్తున్న బీఎన్ ప్రభావం ఆమెపై ఎంతో ఉంది. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే తండ్రిని పోగొట్టుకున్న స్వరాజ్యం.. తన భావాలను పది మందికి చెప్పడానికి అవసరమైన విద్యను మాత్రమే అభ్యసించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఆంధ్ర మహాసభ తరఫున తన సోదరి శశిరేఖ, సోదరులతో కలిసి ఉద్యమించారు. పదకొండో ఏట ఆమె ఆంధ్ర మహాసభలో సభ్యురాలిగా చేరారు. 1940వ దశకంలో కమ్యూనిస్టు ఉద్యమం దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్న తరుణంలో స్వరాజ్యం, ఆమె సోదరులు ఆ పార్టీలో సభ్యులుగా చేరారు. రాజక్క పేరుతో స్వరాజ్యం గెరిల్లా పోరాటం సాగించారు. ఝాన్సీ లక్ష్మీబాయిలా గుర్రాన్ని పరుగులు తీయించారు. పోలీసు బలగాలను ముప్పు తిప్పులు పెట్టడంతో ఆమెను పట్టించిన వారికి పదివేల బహుమానాన్ని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన స్వరాజ్యం.. వందలాది పల్లెల విముక్తి పోరాటంలో అగ్ర భాగాన నిలిచారు. స్వరాజ్యం, ఆమె సోదరుడు అజ్ఞాతవాసంలో ఉండగా రజాకార్లు వారి ఇంటిని తగులబెట్టి ధ్వంసం చేశారు. స్వరాజ్యం తన 17ఏండ్ల వయస్సులో గోదావరి వన్య ప్రాంతాల్లో కోయల ఉద్యమానికి నాయకత్వం వహించారు. గిరిజనుల్లో చైతన్యం రగిల్చి సుశిక్షిత సైనిక దళాలుగా తీర్చిదిద్దింది. 1954లో మల్లు వెంకటనరసింహారెడ్డితో ఆమెకు వివాహమైంది.
16వ ఏట తుపాకీ పట్టిన స్వరాజ్యం.. సాయుధ పోరాటం ద్వారా ఎందరో మహిళలను చైతన్యవంతం చేశారు. ఆమె ప్రసంగాలు గ్రామాలకు గ్రామాలనే కదలించేలా ఉండేవి. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం తన సోదరుడు బీఎన్ రెడ్డి సారథ్యంలో సాయుధ పోరాటంలో ముందుండి నడిచారు. అప్పట్లో ఎక్స్ సర్వీస్మెన్ జైపాల్సింగ్ ఇచ్చిన శిక్షణలో స్వరాజ్యంతో పాటు మరో 300 మంది మహిళలు స్వయంగా ఆయుధాలు ఉపయోగించడాన్ని నేర్చుకున్నారు. తుపాకులతో గ్రామాల్లోకి వెళ్లి నిజాం ప్రభుత్వ సేనలు, రజాకార్లపై తిరుగుబాటు చేయడంలో స్వరాజ్యం దిట్టగా పేరొందారు. రజాకార్లకు వ్యతిరేకంగా స్వయంగా బాణీలు కట్టి బతుకమ్మ పాటలతో ప్రజలను చైతన్య చేయడంలో కీలకపాత్ర పోషించారు.
మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి రజాకార్ల పాలిట సింహస్వప్నమై నిలిచారు. 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించారు. హైదరాబాద్ సంస్థానం విమోచన అనంతరం నల్లగొండ జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1978, 1983లో రెండు సార్లు సీపీఐ(ఎం) అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.
1978 నుంచి 1985వరకు ఏడేండ్ల పాటు తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన స్వరాజ్యం మహిళల సమస్యలపై శాసనసభలో గళమెత్తారు. సమాన పనికి సమాన వేతనం కోసం ఆమె పాటుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించారు. బంజరు భూములను రెవెన్యూ డివిజనల్ అధికారి దృష్టికి తీసుకువచ్చి వాటిని పేదలకు పంచేందుకు కృషి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. రైతు ఉద్యమాల్లో అగ్రస్థానాన్ని అలంకరించి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో స్వరాజ్యం ప్రధాన పాత్ర పోషించారు. నల్లగొండ జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమాలు చేశారు.
మల్లు స్వరాజ్యం అంతిమ వీడ్కోలు నల్లగొండలో జరుగనున్నది. ఆదివారం ఉదయం 6గంటలకు స్వరాజ్యం భౌతికకాయాన్ని హైదరాబాద్లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్కు తరలించనున్నారు. అక్కడ ప్రజలు, పార్టీ శ్రేణుల సందర్శన అనంతరం ఉదయం 11గంటల వరకు నల్లగొండలోని సీపీఎం జిల్లా కార్యాలయానికి తీసుకురానున్నారు. మధ్యాహ్నం 1గంట వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి 3.30గంటలకు నల్లగొండలోని మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు.
మల్లు స్వరాజ్యం- వెంకటనర్సింహారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. వెంకటనర్సింహారెడ్డి 2004 డిసెంబర్ 4న అనారోగ్యంతో మృతి చెందారు. పెద్ద కుమారుడు మల్లు గౌతమ్రెడ్డి వృత్తి రీత్యా వైద్యుడు. సీపీఎం అనుబంధ, జన విజ్ఞాన వేదికలో కీలకంగా పనిచేశారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జునరెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాగార్జునరెడ్డి భార్య మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్వరాజ్యం కుమార్తె పాదూరి కరుణ ప్రజారాజ్యం పార్టీ ద్వారా క్రీయాశీల రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
నైజాం గుండాలను తరిమికొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన మల్లు స్వరాజ్యం పోరాటం ఎందరికో ఆదర్శం. ప్రజా సేవకు పరితపిస్తూ నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప యోధురాలు. ప్రజా ప్రతినిధిగా ఆమె ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
-శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
ప్రజల కోసం అలుపెరగకుండా నిబద్ధతతో పని చేసిన ధీర వనిత మల్లు స్వరాజ్యం. రెండు పర్యాయాలు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలు అమోఘం. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని పార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
-బడుగుల లింగయ్యయాదవ్, రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ సాయుధ పోరాటంలో, ఎమ్మెల్యేగా, మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో మల్లు స్వరాజ్యం సేవలు మరువలేనివి. తుంగతుర్తి ప్రజలతోపాటు యావత్ తెలంగాణ ప్రజల కోసం ఆమె చేసిన సేవలు గొప్పవి. మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తిని కొనసాగించడమే ఆమెకు మనమిచ్చే నివాళి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భవవంతుడిని ప్రార్థిస్తున్నా.
-గాదరి కిశోర్కుమార్, తుంగతుర్తి ఎమ్మెల్యే
మాజీ శాసన సభ్యురాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు త్యాగం మరువలేనిది. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ ఆమెను గుర్తుంచుకుంటారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసిన తీరు మరువలేం. సాయుధ పోరాటంలో ఆమె తెగింపు, స్ఫూర్తిని గొప్పది. ఆమె మరణం సమాజానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
– శానంపూడి సైదిరెడ్డి, హుజూర్నగర్ ఎమ్మెల్యే
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం సీనియర్ నాయకురాలు, మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం చరిత్ర మహిళలందరికీ ఆదర్శనీయం. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆమె ఐకాన్ లాంటిది. జిల్లా పోరాట చరిత్రలోనే శాశ్వతంగా నిలిచిపోయే యోధురాలు. సమాజమార్పు కోసం చివరి క్షణం వరకు అలుపెరగని పోరాటం చేసిన వీరవనిత. ఆమె మరణం తీరని లోటు. ఆమె అత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– ముదిరెడ్డి సుధాకర్రెడ్డి,సీపీఎం జిల్లా కార్యదర్శి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించిన విప్లవ యోధురాలు మల్లు స్వరాజ్యం. ఆమె మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.
-దూదిమెట్ల బాలరాజు, రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మల్లు స్వరాజ్యం ఐకాన్ లాంటివారు. నల్లగొండ జిల్లా పోరాట చరిత్రలోనే
శాశ్వతంగా నిలిచి ఉండే యోధురాలు. సమాజ మార్పు కోసం చివరి క్షణం వరకూ అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత. ఆమె చరిత్ర మహిళలకు ఆదర్శంగా ఉంటుంది. అటువంటి మహా నాయకురాలు మల్లు స్వరాజ్యం లేని లోటు పూడ్చలేనిది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి.