ఇల్లందకుంట: ప్రజలను మోసం చేసే బీజేపీ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్సీ, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని గడ్డివానిపల్లి, బూజునూర్ గ్రామాల్లో కురుమ కులస్తులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కరంటు మోటర్లకు మీటర్లు అమర్చడం, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడం, పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు.
కానీ గత 74 సంవత్సరాలలో కేవలం టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ మాత్రమే కురుమలను గుర్తించి మనకు 11వేల కోట్లతో గొర్రెల పంపిణీ, బీరప్ప గుడులకు నిధులు, స్థలాలు ఇచ్చారన్నారు. అలాగే హుజూరాబాద్లో ఎకర స్థలం, కోటి రూపాయలు ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్లో చదువుకొవడానికి వసతి గృహ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం, 5 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద ఉండటానికి వసతిగృహం, శ్రీశైలంలో వసతి గృహాలు, యాదగిరిగుట్టలో వసతిగృహాలు, ముస్లింజంగ్పూల్లో విద్యార్థులకు ఉచిత హాస్టల్ కట్టించినట్లు తెలిపారు. మంచినీళ్లు తాగితే మరువని కుర్మలం కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బలపరుస్తూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని కోరారు.
ఆయన వెంట జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బురుగద్ద పుష్ఫానగేష్, రాష్ట్ర యువత అధ్యక్షుడు తూముకుంట అరుణ్, కొమురెల్లి మాజీ చైర్మన్ నేవెల్లి సంపత్, మాజీ కార్పోరేటర్ గోపు సదానందం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ మల్లయ్య, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కోరె ఎల్లయ్య, ఒగ్గు రమేష్, ప్రభాకర్, బీరయ్య, ఎగితే అశోక్, ఎంపీటీసీ దంసాని కుమార్, ఉప సర్పంచ్ దంసాని తిరుపతి తదితరులు ఉన్నారు.