హనుమకొండ : రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ, బీజేపీ నిజస్వరూపం బయటపడింది.తెలంగాణ పై కక్షసాధింపుగా మోదీ వ్యవహరిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం హన్మకొండ లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన పై ప్రధాని వ్యాఖ్యలకు టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందన్నారు. వారి వ్యాఖ్యలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష, అనేకమంది ఆత్మబలిదానాలతో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేశారని మంత్రి గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన హామీలు ఇంకా నెరవేరలేదు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను సరిగా అమలు చేయడంలేదు. కొన్ని సవరణలు చేయాలని కేసీఆర్ కోరారు. దొంగ బీజేపీ నాయకులు అంబేద్కర్ ను విమర్శించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులను ఉరికిచ్చి కొడుతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదన్నారు.
బీజేపీ నాయకులను గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్నాం.బీజేపీ నాయకులకు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేసి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాలన్నారు.