హుజూరాబాద్ : బడుగు బలహీన వర్గాల నేతగా చెప్పుకుంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్కు బీసీలకు చేసింది ఏమిలేదని, మీదికి మాత్రమే బీసీలపై ప్రేమ చూపిస్తాడని, బీసీ ఓట్లు అడిగే అర్హత ఆయనకు లేదని మాజీ మంత్రి ఎల్ రమణ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేద వర్గాలను ఈటల ఏనాడు పట్టించుకోలేదని, బీసీ సంఘాల శ్రేయస్సు కోసం ఏనాడు పాటుపడలేదన్నారు.
బీసీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న బీజేపీ ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కోల్పోయిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొత్తం తగ్గిపోయాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో బతుకుదెరువు కోసం వలస వెళ్లిన చేనేత కార్మికులు తిరిగి వచ్చారన్నారు. బీజేపీ ప్రభుత్వం చెల్లించే 4శాతం ఉన్న త్రిఫ్ట్ను రద్దు చేస్తే చేనేత కార్మికుల మేలు కోరి రాష్ట్ర ప్రభుత్వం 16శాతం చెల్లిస్తుందన్నారు.
దేశ వ్యాప్తంగా కోటి మందికి జీవనోపాధి ఇస్తున్న చేనేత రంగానికి కేవలం రూ.400కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయిం చారని, ఇదీ తెలంగాణ రాష్ట్రం కార్మికులకు ఇస్తున్న బడ్జెట్ కంటే చాలా తక్కువ అని దుయ్యబట్టారు. అదే విధంగా రూ.30లక్షలు టర్నోవర్ దాటిన చేనేత సహకార సంఘాలకు ఇచ్చే మార్కెటింగ్ రాయితీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో పాటు హ్యాండ్లూమ్ బోర్డు, మహ్మాత్మాగాంధీ బునకర్ బీమా యోజన, ఐసీఐసీఐ ఆరోగ్యబీమా వంటి పథకాలను రద్దు చేసి చేనేత కార్మికుల ఉసురు పోసుకుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 40శాతం లోన్పై సబ్సిడీ ఇస్తుందని, దేశంలో ఎక్కడ లేదన్నారు. తిఫ్ట్ పథకంతో ఇప్పటి వరకు 40వేల మంది చేనేత కార్మికులు లబ్ధిపొందారని, ఈ సంవత్సరం దాదాపు లక్ష మంది లబ్ధి పొందనున్నారన్నారు. చేనేత బీమా ప్రకటనలో కార్మికులకు భరోసా కలిగిందని, అనుబంధ కార్మికులకు కూడా ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయన్నారు. 1200ఎకరాల్లో వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్క్ను ప్రభుత్వం రూపకల్పన చేసిందని, దీనికి ద్వారా పదో తరగతి చదువుకున్న యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
కేటీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలోకి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. కూలీని ఓనర్ను చేసిన ఘనత కేసీఆర్కే చెందుతుందని, గతంతో పోల్చితే చేనేత రంగానికి రెట్టింపు బడ్జెట్ కేటాయించడం జరుగుతుందన్నారు. 50సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లు, సహకార సంఘాలకు మార్కెటింగ్ సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. కేటీఆర్ హ్యాండ్లూమ్ మండే ప్రచారంతో చేనేత వినియోగదారులు పెరిగారని, పావలా వడ్డీ మార్కెట్ రాయితీ, ఎక్స్గ్రేషియా, కామన్ వర్క్ షెడ్, లోన్ సబ్సిడీ, త్రిఫ్ట్ తదితర పథకాలతో చేనేత కార్మికులకు బతుకుపై భరోసా కలిగిందన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా కరీంనగర్లో నేత బజార్ ప్రారంభించబడిందని, దీనిద్వారా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు. ఈటల రాజేందర్కు పద్మశాలీలు అంటే చాలా చిన్న చూపు అని, ఏ రోజు పద్మశాలీల భాగోగుల గురించి పట్టించుకోలేదన్నారు. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా నేత వస్త్ర జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం విధించి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు.
బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుందని, ఇప్పటి వరకు రూ.1700కోట్లను చీరలపై ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు చింత ప్రభాకర్, సమ్మరావు, స్వర్గం రవి, సంగెం ఐలయ్య, బుర మల్లేశం, బింగి శ్రీధర్, వాసాల రమేష్, రోషన్బాలు, గుండు భూపేష్లున్నారు.