తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సేవలను ఏకాంతంగా నిర్వస్తున్న విషయం తెలిసిందే. ప్రతిఏటా పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను ఏకాంతంగా చేపట్టారు.
శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ బయలుదేరి శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు.