(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్లో అణగారిన వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళల సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూసి ఆర్థిక విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. నీతి ఆయోగ్ మార్గ దర్శకాల ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు తప్పనిరి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో అలా జరగలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు నిధులు పెంచినా, అవి 2021-22 కంటే తక్కువే.
గిరిజనాభివృధ్ధి శాఖలో ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు తప్ప ఇతర పథకాలకు నిధుల్లో పెంపుదల లేదు. పీఎం పీవీటీజీ పేరుతో కొత్త పథకం ప్రారంభించినా కేటాయింపులు రూ.256 కోట్లే. గిరిజనుల జీవన భృతి పెంచేందుకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు ఎక్కువ కేటాయించినట్టు చూపించినా, మహిళాసాధికారత కోసం పార్ట్-బీ పద్దు కింద గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే 6 శాతం నిధులు తగ్గాయి. దివ్యాంగులపైనా కేంద్రం వివక్ష చూపింది. మైనారిటీలకైతే బడ్జెట్లో గత ఏడాది కంటే ఏకంగా 38 శాతం నిధులను తగ్గించింది.