నిర్మల్ అర్బన్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రుకుల పాఠశాలలో బద్దం భోజా రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కెజిబివి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 1000 విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను మంత్రి పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బద్దం భోజా రెడ్డి 1000 మందికి స్టడీ మెటీరియల్ ను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. మన ఊరు మన బడి తో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయని మంత్రి పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలోని చదువుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు. మే11 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని అధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ నెల 16న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా విద్యార్థులు మంత్రితో కేక్ కట్ చేయించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ రామ్ కిషన్ రెడ్డి, డీఈవో రవీందర్ సెక్టోరల్ ఆఫీసర్ సలోమికరుణ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగ శంకర్, నిర్మల్ కెజిబివి ఎస్.ఒ సుజాత, ఆయా కేజీబీవీలో ఎస్ వో లు ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.