హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వ్యవసాయశాఖలో పనులు చేయించేందుకు తన కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎరువులు, విత్తనాల లైసెన్స్ మంజూరు చేయిస్తానని లంచం డిమాండ్ చేశాడని, ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్న ఆయన.. మంగళవారం మరో రూ.లక్ష తీసుకుంటుండగా పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అనంతరం ఎల్బీనగర్లోని ఆయన నివాసంలో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ సమక్షంలో సోదాలు నిర్వహించారు. గోవర్ధన్ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్కు తరలించినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.