YS Jagan | మంగళగిరిలో చేనేత వర్గానికి పోటీ చేసే అవకాశమిచ్చామని ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఇందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను ఒప్పించామని తెలిపారు. బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చంద్రబాబు కుటుంబం పోటీ చేస్తోందని అన్నారు. మనం ఈ టికెట్ను బీసీలకు ఇస్తే.. వాళ్లేమో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలో చేనేతలో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. లావణ్య దగ్గర చంద్రబాబు కొడుకు దగ్గర ఉన్నంత డబ్బు లేదని తెలిపారు. వాళ్లు డబ్బు ఇస్తే తీసుకోండి.. ఓటు వేసే సమయంలో ఆలోచించాలని సూచించారు. ఎవరు అమ్మఒడి, చేయూత ఇస్తారో ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
మంగళగిరిలో పేదలకు 54వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని.. కానీ చంద్రబాబు, లోకేశ్ కలిసి కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని జగన్ అన్నారు. ఇళ్లు కట్టాలని మేం నిర్ణయిస్తే.. మళ్లీ చంద్రబాబు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. పేదలకు జరిగే మంచిని జరగకుండా రాజకీయాల కోసం ఆపేశారని పేర్కొన్నారు. పేదలకు మంచి చేస్తుంటే అడ్డుకునే ఏనాయకుడైనా రాజకీయాలకు అనర్హుడని పేర్కొన్నారు. పేదలకు రూ.10 లక్షల ఆస్తి దక్కుండా కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్ ఓటు అడగానికి వస్తే దీనిపై నిలదీయాలని ప్రజలకు సూచించారు. మోసాలు చేయం, అబద్ధాలు చెప్పం.. చేసేదే మేనిఫెస్టోలో పెడతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అర్హులకు పథకాలు అందకపోతే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు.