హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం బతుకమ్మ వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో జరిగిన సంబురాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ అని, ప్రకృతిలోని రంగురంగు పువ్వుల ద్వారా గౌరీదేవిని పూజిస్తూ తెలంగాణ మహిళలు గొప్పగా జరుపుకునే పండుగ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మకు విశ్వవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు.
టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ బతుకమ్మ అంటే పచ్చని పాడి పంటలు, సుఖ సంతోషాలు, కులమతాలకు అతీతంగా అందరు ఆప్యాయతతో కలిసి ఉండి, బతుకునే నేర్పేదేనన్నారు. ఈ సందర్భంగా మహిళా అధికారులంతా తమ హోదాలను పక్కనపెట్టి సంబురాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సెక్రటేరియట్, నగర శాఖల శాఖలు, వివిధ కార్యాలయాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా అధికారులు తరలివచ్చి బతుకమ్మ ఆటలాడారు. గౌరమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆ తర్వాత శోభాయాత్రగా వెళ్లి బతుకమ్మను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేశారు.