వరంగల్ : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో శాసనసభ విపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. అశోక్ నగర్ గ్రామంలోని కాకతీయ చారిత్రక కట్టడం మట్టి కోట శివాలయాన్ని విధ్వంసం చేసిన ప్రాంతాన్ని హరీశ్ రావు పరిశీలించేందుకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్నే తలు కూల్చివేత స్థలంలో ఏర్పాటు చేసిన టెంట్ను పోలీసులు తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులతో టెంట్ ఎందుకు తొలగించారని గులాబీ శ్రేణుల వాదనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, అశోక్నగర్లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న కోటకట్టగా స్థానికులు పిలిచే మట్టికోట శిథిలాల మధ్య ఉన్న కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని మంగళవారం ధ్వంసం చేసి కుప్పపోశారు. అశోక్నగర్లో సైనిక్స్కూల్ను ఆనుకొని ఉన్న స్థలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టుబట్టారు. దీంతో అధికారులు సైనిక్స్కూల్ సు విశాల స్థలంలోని 30 ఎకరాల స్థలాన్ని ఇంటెగ్రేటెడ్ స్కూల్కు కేటాయించారు. ఆ స్థలంలో నే 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన శివాలయం ఉన్నది.
దాని చుట్టూ మట్టికోట ఉన్నది. అది కేవలం శివాలయమే కాకుండా కాకతీయ చరిత్ర, వారసత్వ సంపదకు నెలవైన శిల్పరీతులు, ఘనమైన వారసత్వానికి ప్రతీకగా ప్రతాపరుద్రుడు వేయించిన శాసనం (చరిత్రకారులు దీన్ని అశోక్నగర్ శాసనంగా రికార్డు చేశారు) ఉన్నది. చుట్టూ మట్టికోట.. దాని మధ్య ఆలయం.. దీన్ని పునరుద్ధరిస్తే పాఖాల (చెరువు)కు వచ్చే పర్యాటకులు అశోక్నగర్కు వస్తారని స్థానికులు, చరిత్రకారులు, పురావస్తు శాఖ భావించింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసమని జేసీబీ, బుల్డోజర్లు దిగాయి. ఇంకేమున్నది.. 800 ఏండ్లనాటి కాకతీయుల చరిత్ర, శిల్ప సంపద, ఘనమైన వారసత్వ కట్టడం రేవంత్ సర్కార్ బుల్డోజర్ కింద పడి ఆనవాళ్లు లేకుండా విరిగిపడింది.