హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/అశ్వారావుపేట : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయారు. మరో 22 మందికి గాయాలయ్యా యి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మరో ప్రయాణికుడు మృతిచెందాడు. మృతుల్లో ఒకరు తూర్పు, తొమ్మిది మంది పశ్చిమగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. బస్సు జల్లేరు వాగు వంతెన రెయిలింగ్ను ఢీకొని 25 అడుగుల లోతులో ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వస్తూ బైక్ను తప్పించబోయి వాగులో పడినట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు.
మృతుల్లో బస్సు డ్రైవర్, ఐదుగురు మహిళలు, చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు వచ్చి కిటికీల నుంచి కొందరు ప్రయాణికులను బయటకు తీశారు. ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ రూ.5 లక్షల చొప్పున ప్రకటించారు.