హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): పర్యావరణ అనుకూల హరిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యం మరో ఘనత సాధించింది. 2022-25 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్’ గుర్తింపును కైవసం చేసుకొన్నది. 40% పచ్చదనంతో విద్యుత్తు వినియోగాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించేలా ఈ ఆలయాన్ని నిర్మించడంతో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఈ గుర్తింపు ఇచ్చింది. గుహలో స్వయంభువుగా వెలిసిన 13వ శతాబ్దంనాటి స్వామివారి విగ్రహానికి ఎటువంటి నష్టం జరగకుండా ప్రణాళికాబద్ధంగా ఆలయా న్ని నిర్మించినందుకు ఈ అవార్డు లభించినట్లు ఆలయ వైస్చైర్మన్ జీ కిషన్రావు తెలిపారు. సన్ పైప్ ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ సిద్ధంగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ఏర్పాట్లు చేయడంతోపాటు భక్తుల కోసం 14 లక్షల లీటర్ల సామర్థ్యం గల కొలను, స్వచ్ఛమైన మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ గుర్తింపునకు మరో కారణమని వివరించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అనుబంధ సంస్థ అయిన ఐజీబీసీ నిర్మా ణ రంగంలో హరిత విధానాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచేందుకు కృషి చేస్తున్నది. 2025 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ అనుకూల నిర్మాణాలు జరిపే దేశాల సరసన భారత్ను నిలపాలన్నది ఐజీబీసీ లక్ష్యం.
సీఎం కేసీఆర్ హర్షం
యాదాద్రి ఆలయానికి ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం (గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్)గా గుర్తింపు లభించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దకిన గొప్ప గౌరవమని తెలిపారు. ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభు త్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్ నిర్మించిన ఈ ఆలయం భారత ఆధ్యాత్మిక పునరుజ్జీవ వైభవానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్థ్యానికి భంగం వాటిల్లకుండా ఈ ఆలయాన్ని ఆధునీకరించడాన్ని ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రశంసించడం తెలంగాణ ప్రభుత్వానికి దకిన అపూర్వ గౌరవమన్నారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కృపాకటాక్షాలు ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.