కొండగట్టు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు (Kondagattu) ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు. మాల విరమణకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అంజన్న క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. కాగా, ఉత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలు, వాహన పూజలను అధికారులు రద్దుచేశారు. 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేశారు. ఈ ఉత్సవాలు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు కొండగట్టు అంజన్నను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఐదొందల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ ప్రచారం ఉన్నది.. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవులను మేపుతున్నాడు. ఒక ఆవు మందలోనుంచి తప్పిపోవడంతో దానిని వెతుక్కుంటూ అతడు కొండగట్టు వరకు వస్తాడు. ఎండలో తిరిగి అలసి ఓక చెట్టు నీడలో నిద్రపోతాడు. అప్పుడు అతనికి కలలో ఆంజనేయుడు కనిపించి నేను తంబోర పొదలో ఉన్నాను. నాకు గుడి కట్టించు. తప్పిపోయిన నీ ఆవు ఫలానా చోట ఉందని చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట.
దాంతో అతడు కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట. అయితే ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాల (నరసింహస్వామి, ఆంజనేయుడు)తో కనిపిస్తాడు. అంతేకాదు ఛాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సీతమ్మ బావిలోని నీళ్లతో రోజూ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ. గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి, ఆండాల్.. ఎడమవైపు శివపంచాయతన ఆలయం ఉంటాయి. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి ఏడాదిలో రెండుసార్లు (చైత్ర, వైశాఖ మాసాల్లో) జరుగుతుంది.