Summer Holidays | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): బడిపిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చేశా యి. ఒక్కరోజు బడికెళితే చాలు 49 రోజులు సెలవులే. 2024 -25 విద్యాసంవత్సరం ముగింపు దశకు చేరింది. మంగళవారమే బడులకు ఆఖరి పనిదినం. సోమవారంతో సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు ముగియనున్నా యి. మంగళవారం బడుల్లో పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి, ఆన్లైన్ ప్రోగ్రెస్కార్డులు ఇస్తారు. ఇక బుధవారం నుంచి జూన్ 11 వరకు బడులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న బడులు తిరిగి తెరుచుకుంటాయి.
ఈ విద్యా సంవత్సరంలో అల్పాహారానికి శ్రీకారం
రాష్ట్రంలోని సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చే ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకానికి గత కేసీఆర్ సర్కారు ఈ విద్యాసంవత్సరంలోనే శ్రీకారం చుట్టింది. దాదాపు 27,147 పాఠశాలల్లోని 23 లక్షల విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకానికి అంకురార్పణ చేసింది. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలోని 3,500 స్కూళ్లల్లో ఈ పథకాన్ని విస్తరించారు. ఈ పథకం అమలుతో బడుల్లో హాజరు శాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ పథకాన్ని ప్రస్తుతం రేవంత్రెడ్డి సర్కారు అటకెక్కించింది.
మౌలిక వసతుల కల్పనపై ఫోకస్
ఈ వేసవి సెలవుల్లో రాష్ట్రంలోని బడుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకో సం రూ. 1100కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నది. పనులను పూర్తి చేసి, జూన్ 5 కల్లా బడులను సిద్ధం చేయాలని గడువు విధించింది.