హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య సూచీల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో మూడోస్థానానికి ఎగబాకింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ చర్యలు, దవాఖానల్లో ఆధునిక వసతులతో ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెరిగింది. ఆరోగ్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలో మాతృమరణాల రేటు(ఎంఎంఆర్), శిశు మరణాల రేటు(ఐఎంఆర్), నవజాత శిశు మరణాల రేటు( ఎన్ఎంఆర్), ఐదేండ్లలోపు పిల్లల మరణాల రేటు(యూఎస్ఎంఆర్)లో గణనీయ మార్పు నమోదైంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ఆరోగ్య సూచీలో ఈ విషయం స్పష్టమైంది.
కేసీఆర్ కిట్.. రూ.1,176 కోట్లు
2017లో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. ఇప్పటివరకు 13,29,951 మంది లబ్ధిపొందారు. వారికి ఆర్థికసాయం కింద 1,176 కోట్లను బదిలీ చేసింది. గర్భిణులు, బాలింతల రవాణాకు పెట్టిన అమ్మ ఒడి వాహనాలను 41 లక్షల మంది వినియోగించుకొన్నారు. నవజాత శిశువుల కోసం 35 ఎస్ఎన్సీయూలు పనిచేస్తున్నాయి. టీకాల పంపిణీలో రాష్ట్రం 99% లక్ష్యాన్ని సాధించింది.
బస్తీ దవాఖానలు.. ఉచితంగా పరీక్షలు
పట్టణ పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి జీహెచ్ఎంసీ పరిధిలో 259 బస్తీ దవాఖానాలు పని చేస్తున్నాయి. వీటిలో 195 రకాల మందులు, 57 రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. వీటితోపాటు సెకండరీ హెల్త్ కేర్లో 10,170 పడకలతో 175 దవాఖానలు సేవలందిస్తున్నాయి. తృతీయ ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్యవిద్యను ప్రజలకు చేరువచేసింది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత డయాగ్నస్టిక్ కేం ద్రాలను ఏర్పాటు చేసి హబ్ & స్పోక్ మాడల్ కింద రక్త పరీక్షలు, ఈసీజీ, ఎక్స్-రే, యూఎస్జీ వంటి డయాగ్నస్టిక్ సేవలను అందిస్తున్నది. 20 జిల్లాల్లో ఏర్పాటుచేసిన ల్యాబు ల్లో ప్రతినెలా దాదాపు 4 లక్షల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం హబ్ల్లో పాథాలజీ, రేడియాల జీ, వైరాలజీ సేవలను కూడా అందిస్తున్నాయి.
25 లక్షల ఆపరేషన్లు.. 13 లక్షల మందికి లబ్ధి
ఆరోగ్యశ్రీ ద్వారా 87.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతున్నది. ఇప్పటివరకు 25 లక్షలకు పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. 13 లక్షలకు పైగా రో గులు లబ్ధిపొందారు. నిరుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేసింది.