హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ తెలంగాణకు అవార్డుల పంట పండుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణకు వచ్చినన్ని అవార్డులు మరే రాష్ట్రానికి రాలేదన్నారు. అన్ని శాఖల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. నాడు కేసీఆర్ సిద్దిపేటలో ఇంటింటికీ నీళ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారని వెల్లడించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోదీ పొగిడారని తెలిపారు.
తాను అధికార, ప్రతిపక్షంలో 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానని, అసెంబ్లీలో నేడు నీళ్లు, కరెంట్ గురించి మాట్లాడే వ్యక్తి లేరని వ్యాఖ్యానించారు. 54 లక్షల ఇండ్లకు నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 59.94 టీఎంసీ నీళ్లను ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కింద రాష్ట్రానికి ఏడు అవార్డులు, మిషన్ భగీరథ కింద 14 అవార్డులు వచ్చాయన్నారు. కేంద్రం అవార్డులు ఇవ్వడమే కాదు నిధులు కూడా ఇవ్వాలని చురకలంటించారు. నిధుల విషయంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నది ఆగ్రహం వ్యక్తంచేశారు.