హైదరాబాద్, జనవరి 17 : ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తమిళనాడు మొదటి స్థానంలో, గుజరాత్ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో తెలంగాణ అధిక పెట్టుబడులను సాధించిందని, కొవిడ్కు ముందునాటి కంటే ఇప్పుడు తెలంగాణలో మెరుగైన పరిస్థితులు ఏర్పడ్డాయని ‘ప్రాజెక్ట్స్ టుడే’ వెల్లడించింది. ఈ సంస్థ సర్వే ప్రకారం.. 2020తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు రూ.1.07 లక్షల కోట్ల పెట్టుబడులు అధికంగా సాధించింది. గతంలోకన్నా అతి తక్కువ పెట్టుబడులు సాధించిన రాష్ర్టాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఢిల్లీ, గోవా ఉన్నాయి. 2020తో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం తయారీ రంగంలో పెట్టుబడులు గణనీయంగా 419 శాతం పెరిగి రూ.5,27,081 కోట్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానాల్లో మైనింగ్ (21% పెరుగుదలతో రూ.51,616 కోట్లు), విద్యుత్ (6% పెరుగుదలతో రూ.1,19,616 కోట్లు) రంగాలు ఉన్నాయి. మౌలిక వసతుల రంగానికి రూ.5,70,417 కోట్లు, నీటి పారుద రంగానికి రూ.7,949 కోట్లు వచ్చినప్పటికీ 2020తో పోల్చుకుంటే పెట్టుబడులు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.12.76 లక్షల విలువైన 7,700 కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. కొవిడ్కు ముందు వచ్చిన పెట్టుబడుల కంటే ఇది 47% అధికమని ప్రాజెక్ట్స్ టుడే వెల్లడించింది.