చిన్న సన్నకారు రైతులకు చేయూత నివ్వడమే విజయ తెలంగాణ మెగా డెయిరీ లక్ష్యం
-రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సంక్షేమ రంగంలో దేశంలోనే తెలంగాణ నెం 1 గా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాలలో 250 కోట్లతో తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి పాల్గొన్నారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే రాష్ట్రంలో ఉన్న రైతులకు స్వర్ణ యుగం ఆరంభమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక లక్ష్య సాధనతో ముందుకు పోతుందని అన్నారు.
తెలంగాణలో నాలుగున్నర లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతుందని అన్నారు. సన్న,చిన్న కారు రైతులను ఆర్ధికంగా ఆదుకొని వారికి చేయూత నందించాలనే ఉద్దేశంతో ఇక్కడ డెయిరీ ఫాం ఏర్పాటుచేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈడెయిరీ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. .సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాడని అన్నారు. సంవత్సరంలో 365 రోజులు తెలంగాణ విజయ డైయిరీ పాల సేకరణ సాగుతుందని అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే దిక్సూచిగా నిలుస్తుందని అన్నారు.తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతు బంధుతో రైతుల బతుకుల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా మారుతున్నాయని ఆయన అన్నారు.
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో విజయ డెయిరీ రావడం రైతులకు శుభసూచకమని అన్నారు.ప్రతి ఒక్క రైతు విజయ డెయిరీని ఆదరించాలని అన్నారు. ఎక్కడైన పశువులు చనిపోతే వారికి 15 రోజుల్లో ఇన్సూరెన్సు అందజేస్తామని ఆయన అన్నారు. తెలంగాణలో ఎక్కువగా కులవృత్తుల మీదనే ఆదరపడి జీవిస్తున్నారని అన్నారు. గొల్లకుర్మలు ఆర్ధికంగా ఎదుగడానికి వారందరికీ గొర్లను పంపిణీ చేస్తున్నామన్నారు. గొల్లకుర్మలందరికీ తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాడీ రైతులకు తగు న్యాయం చేస్తామని అన్నారు.