తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు ధూంధాంగా సాగాయి. కామారెడ్డిలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అంతరించిపోతున్న కళారూపాలకు జీవం పోసే విధంగా కళా ప్రదర్శనలు సాగాయి. ఈ సందర్భంగా కవులు, కళాకారులను అతిథులు ఘనంగా సన్మానించారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రం ఎనిమిదేండ్లలో ఎంతో ప్రగతి సాధించిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ సమాజంలోని ఐక్యతను చాటి చెప్పేలా వేడుకలు జరుగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తూ దేశంలో మొదటిస్థానంలో నిలిపారన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఘనంగా సత్కరించారు.
ఖలీల్వాడి/విద్యానగర్, సెప్టెంబర్ 18 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన సాంస్కృతిక కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్, కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో కళాకారులు, విద్యార్థినుల ప్రదర్శనలు ధూంధాంగా సాగాయి. చిందు యక్షగానం, దేశభక్తి గేయాలు, నాటికలు, ఒగ్గుకథ, కోలాటం, తెలంగాణ జానపద గేయాలతో కూడిన నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ వీరుల పోరాట స్ఫూర్తిని విద్యార్థులు నాటికల రూపంలో కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులు, కవులు, కళాకారులను ముఖ్య అతిథులు సన్మానించారు.
ఆర్మూర్ గాంధీగా పిలిచేవారు..
నా భర్త తమ్మిరాములు 1947లో జరిగిన హైదరాబాద్ రాష్ట్ర విమోచన ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేసి 8 నెలలు జైల్లో పెట్టారు. ఆయన చేసిన సంఘ సంస్కరణలు, జాతీయ భావాలకు ఆర్మూర్ ప్రాంత ప్రజలు ముగ్ధులయ్యారు. ప్రజల్ని చైతన్య పర్చేందుకు జాతీయ జెండాలతో అందరినీ నిద్రలేపేవారు. దీంతో ఆయనను ఆర్మూర్ గాంధీగా పిలిచేవారు. ఆయన చేసిన ఉద్యమానికి సహకరిస్తూ సేవలందించేదాన్ని.
– సరస్వతి, తమ్మి రాములు భార్య
రెండుసార్లు చంపాలనుకున్నారు..
మహాత్మా గాంధీతో మా ఆయన ఈశ్వర్ దాస్ సజన్ ఆర్య పనిచేశారు. 1948 సెప్టెంబర్ 17న శత్రుమూకలు ఆయనను టార్గెట్ చేశాయి. పెద్దబజార్లో రెండుసార్లు చంపడానికి చూశారు. ఎక్కువగా భజన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఔరంగాబాద్లో అరెస్టు చేశారు.
– లింగుబాయి, ఈశ్వర్దాస్ సజన్ ఆర్య సతీమణి
తమ్మిరాములు భార్య సరస్వతిని సన్మానిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్
ఖలీల్వాడి, సెప్టెంబర్ 18: రాష్ర్టాన్ని ప్రగతిబాటలో పయనింపజేస్తూ దేశానికే తలమానికంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్త అంబేద్కర్ భవన్లో స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వేముల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జనరంజక పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కొంతమంది మత విద్వేషాలతో సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా చేపట్టిన సమైక్యతా ర్యాలీలో అన్నివర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మనమంతా భారతీయులమని, దేశంలో తెలంగాణ అంతర్భాగమని చాటి చెప్పారని మంత్రి హర్షం వ్యక్తంచేశారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లోనూ కవులు, కళాకారులకు గుర్తింపు దక్కేలా కార్యక్రమాలు నిర్వహించిందని గుర్తు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మెప్మా పీడీ రాములు, ఎస్ఏ అలీం పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను సన్మానిస్తున్న స్పీకర్, ప్రభుత్వ విప్, కలెక్టర్
విద్యానగర్, సెప్టెంబర్ 18: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఎనిమిదేండ్లలో అద్భుత ప్రగతిని సాధించిందని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శాంతియుతమార్గం ద్వారా రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో స్పీకర్ పోచారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దళితబంధు అమలుతో అట్టడుగున ఉన్న దళితులను ఉన్నత వ్యక్తులుగా మార్చడానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేశారన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధతో చదువుకొని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బంగారు బాటలు వేస్తారని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థుల నాయకత్వంలోనే దేశం,రాష్ట్రం నడిచే వీలుందని అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడంతోనే తనకు స్పీకర్ అయ్యే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ మాట్లాడుతూ వచ్చే తరానికి తెలంగాణ చరిత్ర తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలకు ప్రాధాన్యమిచ్చిందన్నారు. బడుగు బలహీనవర్గాలకు సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారన్నారు. కలెక్టర్ జితేశ్ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో గ్రామీణ కళాకారులు ప్రాచీన కళలను ప్రదర్శించే వీలు కలిగిందని తెలిపారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులను సన్మానించారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ట్రైనీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.