మంత్రి కేటీఆర్ లేఖలోని ముఖ్యాంశాలు
ఇండస్ట్రియల్ కారిడార్లకు రూ.9 వేల కోట్లు ఇవ్వాలి
ఫార్మా సిటీకి రూ.5 వేల కోట్లు కేటాయించాలి
డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్లో హైదరాబాద్ను చేర్చాలి
తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్డీసీ)కు నిధులివ్వాలి
హైదరాబాద్, జనవరి 23 : వినూత్నమైన విధానాలతో అగ్రపథాన నిలుస్తున్న తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం చేయూత ఎక్కడని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అద్భుతమైన పారిశ్రామిక విధానంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణకు తగిన సహాయం అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలకు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం పలు అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రికి ఆయన వేర్వేరుగా సవివరమైన లేఖలు రాశారు. ఇండస్ట్రియల్ కారిడార్లకు రూ.9 వేల కోట్లు, ఫార్మాసిటీకి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉన్నదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇండస్ట్రియల్ కారిడార్లకు నిధులు
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ -నాగపూర్ పారిశ్రామిక కారిడార్లను గుర్తించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నోడ్స్ అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మరింత వేగంగా కల్పించాలన్నారు. ప్రతిపాదిత రెండు నోడ్లలో మౌలిక వసతుల కల్పనకు సుమారు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేశామని తెలిపారు. దీంతోపాటు హైదరాబాద్- నాగపూర్ కారిడార్లో భాగంగా మంచిర్యాల నోడ్ను కొత్తగా గుర్తించాలని కోరారు. ఇండస్ట్రియల్ కారిడార్లలోని ఈ మూడు నోడ్లకు రెండు వేల కోట్ల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల కోట్లను కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ – విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్లను జాతీయ ఇండస్ట్రియల్ కారిడార్ కార్యక్రమంలో భాగంగా చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నదని, ఈ రెండు కారిడార్ల ఏర్పాటును తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా స్వీకరించిందని తెలిపారు. ఇప్పటికే హుజూరాబాద్, జడ్చర్ల-గద్వాల-కొత్తకోట నోడ్లను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ రెండింటికీ ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపుతామని తెలిపారు. ఈ రెండు ఇండస్ట్రియల్ కారిడార్లలో ఒక్కోదానికి రూ.1,500 కోట్ల చొప్పున రూ.3 వేల కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించాలని కోరారు.
డీఐపీసీలో హైదరాబాద్ను చేర్చాలి
గత ఏడేండ్లలో డిఫెన్స్-ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిన నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ను చేర్చాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ దేశానికి భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్నదని, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అత్యంత సులువు అవుతుందని తెలిపారు. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బెల్ వంటి అనేక రక్షణ సంస్థలు ఇక్కడ ఉన్నాయని గుర్తుచేశారు. వీటితోపాటు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తోపాటు అనేక ఇతర ప్రముఖ ప్రైవేట్ రక్షణ-ఏరోస్పేస్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం డిఫెన్స్- ఏరోస్పేస్ను ప్రాధాన్య రంగంగా గుర్తించి, భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో రెండు ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ పార్కులు ఉన్నాయని, త్వరలో మరో భారీ ఏరోస్పేస్-డిఫెన్స్ పార్క్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తె లిపారు. జహీరాబాద్ నిమ్జ్లోనూ ఏరోస్పేస్ క్లస్టర్ను సి ద్ధం చేసే ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయని పే ర్కొన్నారు. బోయింగ్, లాక్హీడ మార్టిన్, రువాగ్ వంటి అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ను ఎంచుకున్నాయన్నారు. ఇక్కడ కనీ సం వెయ్యికిపైగా సూక్ష్మ, మధ్యతరహా కంపెనీలు డిఫెన్స్ -ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తున్నాయని తెలిపారు. ఉన్న త విద్యాసంస్థలతోపాటు అద్భుతమైన మానవ వనరులతో డిఫెన్స్- ఏరోస్పేస్ రంగానికి కావలసిన అన్ని అవకాశాలు తమ రాష్ర్టానికి ఉన్నాయని పేర్కొంటూ.. కేంద్రం ప్రతిపాదించిన డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ కారిడార్లో భాగంగా తెలంగాణను గుర్తించాలని కేటీఆర్ కోరారు.
ఎన్డీసీ ఏర్పాటుకు నిధులివ్వండి
తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్ (ఎన్డీసీ) ఏర్పా టు చేయాలని అనేకసార్లు కేంద్రాన్ని కోరామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. గత చర్చల సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి చేసిన సూచన మేరకు నూతన ఎన్డీసీ క్యాంపస్ను ఏర్పాటుచేయడం లేదని, ఇప్పటికే హైదరాబాదులో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఎన్డీసీ కార్యకలాపాలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. నేషనల్ డిజైన్ సెంటర్కు ఎనిమిదేండ్లపాటు కేంద్రం నుంచి నిర్వహణ ఖర్చు కోరుతున్నామని, ఇందులో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉన్నదని వివరించారు. ఈ మేరకు ఎన్డీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు.
ఫార్మా సిటీకి రూ.5 వేల కోట్లు ఇవ్వాలి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టుకు పెద్దఎత్తున ఆర్థికసాయం అందించాలని మంత్రి కేటీఆర్ లేఖలో కేంద్రమంత్రిని కోరారు. కేంద్రం చెప్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫార్మారంగంలో అద్భుతమైన ప్రగతికి ఫార్మాసిటీ కేంద్రంగా నిలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మాసిటీకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ హోదా ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రూ.64 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 5.6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. మాస్టర్ ప్లాన్ కోసం రూ.50 కోట్లు, రోడ్ల లింకేజీ, నీటి సరఫరా, విద్యుత్తు సరఫరా, రైల్వే కనెక్టివిటీ వంటి బాహ్య మౌలిక వసతుల కోసం రూ.1,399 కోట్లు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అంతర్గత మౌలిక వసతుల కోసం మరో రూ.3,554 కోట్లను, మొత్తంగా అన్నీ కలిపి హైదరాబాద్ ఫార్మా సిటీకి రూ.5003 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రిని కోరారు.