హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’తో ఔషధాల చేరవేత సమయం సగానికి తగ్గనున్నదని నీతి ఆయోగ్ పేర్కొన్నది. డ్రోన్ల ద్వారా ఔషధాలను చేరవేసేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనట్టు తెలిపింది. నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో చేపట్టిన కార్యక్రమాల జాబితాలో స్థానం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం, నీతి ఆయోగ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం కలిసి నిరుడు సెప్టెంబర్లో వికారాబాద్లో ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ని ప్రయోగాత్మకంగా పరీక్షించాయి. ‘బియాండ్ ద విజువల్ లైన్ ఆఫ్ సైట్’ (బీవీఓఎల్ఎస్) డ్రోన్ల ద్వారా ఔషధాలను, 300 డోసుల వ్యాక్సిన్లను సుమారు 26 కిలోమీటర్ల దూరానికి చేరవేశారని నీతి ఆయోగ్ పేర్కొన్నది. రోడ్డుమార్గంతో పోల్చితే ప్రయాణ సమయం 50 శాతం తగ్గినట్టు వెల్లడించింది. రోడ్డు మార్గం లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలను చేరవేసే అవకాశం కలిగిందని కొనియాడింది.
మాతాశిశుమరణాల రేటును తగ్గించడంలో, వ్యాక్సినేషన్కు, ఇతర అత్యవసర ఔషధాల సరఫరాకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పింది. ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో డ్రోన్ల ద్వారా ఔషధాలను, వ్యాక్సిన్లను సరఫరా చేయడంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నది. తెలంగాణలో లభించిన విజయం స్ఫూర్తి తో కొండ ప్రాంతాలు అధికంగా ఉన్న ఈశాన్య రాష్ర్టా లు, హిమాచల్ప్రదేశ్లో త్వరలో మెడిసిన్ ఫ్రమ్ స్కై ప్రయోగాలు చేపట్టనున్నట్టు నివేదికలో పేర్కొన్నది.