దేశంలో అత్యధిక వేతనాలు మన దగ్గరే
కరోనా తర్వాత పీఆర్సీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
సంక్షోభంలో కోతపెట్టిన వేతనాలనూ చెల్లించని పలురాష్ర్టాలు
హైదరాబాద్, మార్చి 22 ( నమస్తే తెలంగాణ): దేశంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్న ప్రభుత్వోద్యోగులు మనదగ్గరే ఉన్నారు. ఉద్యమకాలంలో ఉద్యమపార్టీతో చేయిచేయి కలిపి నడిచి దశాబ్దాల కలసాకారంలో భాగస్వాములైన ఉద్యోగులు సగర్వంగా తలెత్తుకొనేలా వేతనాలు పొందాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష ఇవాళ నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్తోపాటు.. ఉద్యమంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిన 42 రోజుల సకల జనుల సమ్మెకు గుర్తుగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ తొలి పీఆర్సీ ఇచ్చిన నివేదికకు నాలుగు రెట్లు అధికంగా 30 శాతం పీఆర్సీని ఇచ్చింది. దీంతో దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకొంటున్న రికార్డును మన ఉద్యోగులు సొంతంచేసుకొన్నారు. కరోనా సంక్షోభం మొదలై సరిగ్గా ఏడాది అయిన క్రమంలో పీఆర్సీ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అక్కడి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించింది. ఏ రాష్ట్రం కూడా కరోనా సమయంలో కోతలు పెట్టిన వేతనాలనైనా తిరిగి చెల్లించలేదు. సంక్షోభం నుంచి వేగంగా తేరుకొని.. తన ఉద్యోగులకు గౌరవప్రదమైన ఫిట్మెంట్ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ఆందోళన నుంచి ఆనందహేల..
‘పీఆర్సీ ఎప్పుడిస్తారో.. ఇస్తే ఎంత ఇస్తారో.. కొంచెం త్వరగా ఇస్తే బాగుండు’.. ఇదీ ఏ ఇద్దరు ఉద్యోగులు కలిసినా మొన్నటిదాకా వినిపించిన చర్చ. పీఆర్సీపై నిన్నమొన్నటిదాకా ఆందోళన, అభద్రతలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఉద్యోగుల అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆశించిన దానికన్నా ఎక్కువ ఫిట్మెంట్ ప్రకటించారు సీఎం కేసీఆర్. పీఆర్సీ ఫిట్మెంట్ను 7.5 శాతం సిఫారసు చేసినప్పుడు ఉద్యోగులు ఆందోళన చెందారు. కానీ వాస్తవ పరిస్థితులు తెలిసిన సీఎం కేసీఆర్.. పీఆర్సీ సిఫారసుతో సంబంధంలేకుండా ఏకంగా 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. ఇంత ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తారని తాము ఊహించలేదని ఒకింత ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
పాలనలో మానవీయ పరిమళాలు
చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు
ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు వేతన సవరణను కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తింపచేసేవి. ఈ విధానానికి సీఎం కేసీఆర్ చరమగీతం పాడారు. క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అన్నిరకాల చిరుద్యోగులకు కూడా పీఆర్సీ ప్రకటించే మానవీయ సంస్కృతికి సోమవారం బాటలువేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా 63,443 మంది అంగన్వాడీలకు మూడుసార్లు వేతనాలు పెంచింది. సఫాయి కార్మికులకు సమున్నత స్థానం కల్పించింది. పారిశుద్ధ్య కార్మికుల వెతలు తీర్చేలా సీఎం కేసీఆర్ వేతనాలు పెంచి మానవీయతను చాటా రు. హోంగార్డులకు కానిస్టేబుళ్లతో సమానంగా జీతాలు పెంచింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇప్పుడు వారికి పీఆర్సీని వర్తింపజేస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నది. పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15శాతం ఇచ్చే అదనపు పెన్షన్ (అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్)కు ఉన్న వయో పరిమితిని 75 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు తగ్గించి వృద్ధులకు సీఎం కేసీఆర్ పెద్దకొడుకులా మారారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగ భార్యాభర్తలకు అంతర్జిల్లా బదిలీలను ప్రారంభిస్తున్నామని ప్రకటించి వారి కుటుంబాల్లో సంతోషాలు నింపారు. కేజీబీవీ ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులను ప్రకటించి మానవత్వపు పరిమళాన్ని వెదజల్లారు. మన రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు స్వరాష్ర్టానికి వెళ్లటానికి అనుమతి ఇచ్చి ఉద్యోగులు ఎక్కడివారైనా తమ ప్రేమ ఒకేలా ఉంటుందని చాటారు.
చరిత్రలో నిలిచిపోతారు
ప్రభుత్వానికి ఉద్యోగులకు ఉన్నది చిరకాల బంధం. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ మెరుగైన పీఆర్సీని ప్రకటించడం మా ఆత్మగౌరవాన్ని పెంపొందించడమే. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడిన ఏకైక సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
తలెత్తుకొని నిలబడేలా పీఆర్సీ
ప్రతి ఉద్యోగి గర్వంతో తలెత్తుకొని నిలబడేలా పీఆర్సీ ఇచ్చారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ వర్తింపజేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ఓపికతో ఎదురుచూస్తే సీఎం మనం ఊహించని వరాలు ఇచ్చి కోరికలు నెరవేరుస్తారు.
-వీ మమత, తెలంగాణ గెజిటెడ్
అధికారుల సంఘం అధ్యక్షురాలు
మా ఆత్మగౌరవాన్ని పెంచారు
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మెరుగైన పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కరించే ఫ్రెండ్లీ ప్రభుత్వం. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మన పాలనను బలపరుచుకునేందుకు ప్రతి ఉద్యోగి కృషిచేయాలి.
ఉద్యోగ బాంధవుడు సీఎం కేసీఆర్
ఫిట్మెంట్, ఉద్యోగ విరమణ వయస్సు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ బాంధవుడు. తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్యోగులతో ఆత్మీయ బంధాన్ని పెనవేసుకున్న కేసీఆర్ మానవీయ కోణంలో అన్ని రకాల ఉద్యోగులకు ఊహించిన దాని కంటే ఎక్కువ పెంచి చరిత్ర సృష్టించారు.
-పరిటాల సుబ్బారావు, వరంగల్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు హృదయ పూర్వక కృతజ్ఞతలు. సీఎం కేసీఆర్ చెప్పిన విధంగా మా సంఘం సభ్యులు అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తారు.
-మార్త రమేశ్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
హోంగార్డులకు చరిత్రలో తొలిసారి
సర్వజనుల సాధకబాధకాలు తెలిసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉద్యోగుల బాగోగులను కూడా అర్థం చేసుకోవడం సంతోషకరం. ఉద్యోగులతోపాటు చరిత్రలో తొలిసారి హోంగార్డు సోదరులకు పీఆర్సీ వర్తింపజేయడం సంతోషకరం. మరింత అంకిత భావంతో పనిచేస్తాం.
ఏ ప్రభుత్వం ఇవ్వని ఫిట్మెంట్
దేశంలోని ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. తన నిర్ణయాలతో మరోసారి తాను ఉద్యోగుల పక్షమని చెప్పకనే చెప్పారు. ఉద్యోగుల పక్షాన సీఎంకు కృతజ్ఞతలు.