సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన రంగానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఈవీ పాలసీని తీసుకువచ్చి ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శనివారం టీ హబ్లో నిర్వహించిన తెలంగాణ ఈవీ టుడే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. టీహబ్ వేదికగా టెక్నాలజీలోనే కాకుండా వివిధ రంగాల్లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసే స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాం, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోనూ సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు.
ఈవీ మాస్టర్ క్లాసెస్ పేరుతో 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఈవీల గురించి సమగ్రంగా 3 నెలల పాటు శిక్షణనిచ్చారు. దీంతో వారు ఈవీ రంగంలో సరికొత్తగా ఆవిష్కరణలు చేసేందుకు అవకాశాలు కల్పించడంతో పాటు టీ హబ్ వేదికగా స్టార్టప్లను ప్రోత్సహస్తున్నామన్నారు. ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఈవీ మాస్టర్ క్లాసెస్లో పాల్గొని, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. కార్యక్రమంలో టీఎస్ రెడ్కో వీసీ, ఎండీ ఎన్.జానయ్య, తెలంగాణ ప్రభుత్వ ఆటోమోటివ్ విభాగం డైరెక్టర్ గోపాలకృష్ణన్, ఈవీ రంగానికి చెందిన పలువురు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి విద్యార్థులకు ప్రత్యేకంగా ఈవీ మాస్టర్ క్లాసెస్ పేరుతో శిక్షణ, అవగాహన తరగతులను నిర్వహించామని టీహబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సహకారంతో పాటు ప్రైవేట్ ఈవీ సంస్థలు సహకరించాయన్నారు. ఈ కార్యక్రమానికి 40 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు.