జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యువత పతకాల పంట
రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయడమే లక్ష్యంగా
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
గన్ను గురిపెట్టినా.. విల్లు ఎక్కుపెట్టినా.. కత్తి దూసినా.. పంచ్ విసిరినా.. కబడ్డీ కోర్టులో కూత పెట్టినా.. బాక్సింగ్ రింగ్లో శివంగిలా గర్జించినా..షటిల్ రాకెట్ను రివ్వున దూసినా.. క్రికెట్ బంతిని గింగిరాలు తిప్పినా..రన్నింగ్ ట్రాక్పై పరుగులు పెట్టినా.. అథ్లెటిక్స్లో అబ్బురపరిచినా..లోకం ఆమె ప్రతిభకు దాసోహం..!పురుషులతో పోలికే అక్కర్లేకుండా.. ‘ఇంతి’ంతై వటుడింతై అన్నట్లు క్రీడా యవనికపై మన అమ్మాయిలు పతకాల పంట పండిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్న తెలంగాణ క్రీడా కుసుమాలపై ప్రత్యేక కథనం..
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం;పట్టు పడితే వదిలేది లేదు! ఇది నవతరం అమ్మాయిలు అలవర్చుకున్న శైలి. రంగం ఏదైనా రాణించడమే లక్ష్యంగా దూసుకెళుతున్నారు. చదువుల్లోనే కాదు క్రీడల్లోనూ తమకు తామే సాటి అని నిరూపిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇన్నాళ్లు అబ్బాయిలు ఆధిపత్యం ప్రదర్శించిన చోట అమ్మాయిలు జయకేతనం ఎగురవేస్తున్నారు. క్రీడల్లో నూతన అధ్యాయం లిఖిస్తూ అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. తాము ఎంచుకున్న దారిలో ఎన్ని సమస్యలు ఎదురైనా..వెరవకుండా ముందుకుసాగుతున్నారు. ఇందులో కటిక పేదరికం నుంచి వచ్చిన వారు కొందరైతే.. సామాన్య మధ్యతరగతి నేపథ్యం మరికొందరిది. తెలంగాణ ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఇనుమడింపజేస్తున్న క్రీడా తారలు జిగేల్మంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మద్దతుతో ముందుకెళుతున్న కొందరు మహిళా దినోత్సవం సందర్భాన తమ ఆకాంక్షలు, లక్ష్యాలను పంచుకున్నారు. వీరిలో పరుగుల రాణిగా పతకాలు కొల్లగొడుతున్న అగసర నందిని, టేబుల్ టెన్నిస్లో అంచనాలకు మించి రాణిస్తున్న ఆకుల శ్రీజ, పసి ప్రాయంలోనే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుని జాతీయ జట్టులో చోటు కోసం వేచిచూస్తున్న గొంగడి త్రిష, ప్రత్యర్థులపై పంచ్లు కురిపిస్తున్న ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్, చెదరని గురితో పతకాలు కొల్లగొడుతున్న యువ షూటర్ ఇషాసింగ్ ఉన్నారు.
ర్యాంకింగ్స్ కోసం
రాష్ట్ర యువ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ అంచనాలకు మించి రాణిస్తున్నది. ప్రపంచంలో టాప్ టోర్నీల్లో ఒకటైన సింగపూర్ చాంపియన్షిప్లో పోటీపడుతున్న శ్రీజ మెరుగైన ర్యాంకింగ్స్ తన లక్ష్యమంటున్నది. తొలి రౌండ్లో ప్రత్యర్థిపై విజయంతో ముందంజ వేసిన శ్రీజ రానున్న కామన్వెల్త్, ఆసియా గేమ్స్లో బెర్తు దక్కించుకోవడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ హైదరాబాదీ ప్రస్తుతం జాతీయ ర్యాంకింగ్స్లో నాలుగో ప్లేస్లో ఉంటే అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో 111వ స్థానంలో ఉంది.‘మహిళలు ఎందులోనూ తీసిపోరు. అది ఏ రంగమైనా సరే. మనసు పెడితే ప్రపంచాన్ని జయిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. నా కెరీర్ ఎదుగుదలలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ల మద్దతు మరువలేనిది’ అని శ్రీజ పేర్కొంది.
మిగతా ప్లేయర్ల విషయానికొస్తే..ఇటీవల ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పసిడి పతకంతో మెరుపులు మెరిపించిన ఇందూరు బాక్సర్ నిఖత్ జరీన్..ప్రస్తుతం ప్రపంచ చాంపియన్షిప్ కోసం సిద్ధమవుతున్నది.మరోవైపు కైరో(ఈజిప్టు) వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో ఇషాసింగ్ పతకాల పంట పండిస్తున్నది. సీనియర్ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే రెండు స్వర్ణాలు సహా రజతంతో మెరిసింది. వీరితో పాటు జిమ్నాస్ట్ అరుణారెడ్డి, సిక్కిరెడ్డి(బ్యాడ్మింటన్), జివాంజీ దీప్తి, నిత్య, మహేశ్వరి(అథ్లెటిక్స్), గుగులోతు సౌమ్య(ఫుట్బాల్), సామియా ఇమాద్ ఫారుఖి(బ్యాడ్మింటన్), సంజన, సాయిదేదీప్య, సౌజన్య(టెన్నిస్) జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో తళుక్కుమంటున్న మన తెలంగాణ తారలే కావడం విశేషం.
జాతీయ జట్టులో చోటే ధ్యేయంగా
ఊహ తెలియని వయసులోనే క్రికెట్ బ్యాటు చేత పట్టిన గొంగడి త్రిష..అంచలంచెలుగా ఎదుగుతున్నది. బుడిబుడి నడకలు నేర్చుకునే సమయంలోనే బ్యాటు ఝులిపించిన ఈ అమ్మాయి జాతీయ జట్టులో చోటు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. తండ్రి రాంరెడ్డి ప్రోత్సాహంతో క్రికెట్లో అదరగొడుతున్నది.ఇటీవల జైపూర్లో జరిగిన మహిళల జాతీయ అండర్-19 వన్డే టోర్నీలో రికార్డు స్థాయి ప్రదర్శన చేసింది. ఏప్రిల్లో జరిగే జాతీయ సీనియర్ టీ20 టోర్నీ కోసం సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్న 17 ఏండ్ల త్రిష మాట్లాడుతూ ‘జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. భవిష్యత్లో భారత్కు ఆల్రౌండర్గా సేవలందిస్తా. అమ్మాయిలు ఎందులోనైనా రాణిస్తారనే దానికి నేనే సరైన ఉదాహరణ’ అని చెప్పుకొచ్చింది.
మెగాటోర్నీలే లక్ష్యంగా..
పరుగునే ప్రాణంగా నమ్ముకున్న అగసర నందిని అథ్లెటిక్స్లో భారత భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నది. కనీసం నిలువ నీడలేని పరిస్థితుల్లో నుంచి యువ స్ప్రింటర్లకు ఆమె ఆదర్శంగా నిలిచిన వైనం స్ఫూర్తిదాయకం. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సహకారంతో అటు చదువుతో పాటు పరుగుల పోటీల్లో నందిని జాతీయ స్థాయిల్లో పతకాలు కొల్లగొడుతున్నది. రానున్న రోజుల్లో కామన్వెల్త్, ఆసియా గేమ్స్లో పతకాలు కొల్లగొట్టడమే తన లక్ష్యమంటుంది. ఏప్రిల్ 2 నుంచి మొదలయ్యే జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ టోర్నీ కోసం ప్రస్తుతం సిద్ధమవుతున్న నందిని..మెరుగైన టైమింగ్ కోసం సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నది. వంద మీటర్ల స్ప్రింట్లో ప్రస్తుతం 11.6 సెకన్ల టైమింగ్ నమోదు చేస్తున్న నందిని..మరింత మెరుగయ్యేందుకు చెమటోడుస్తున్నది. ‘అమ్మాయిలు ఎందులో తక్కువ కాదు. తాము ఎంచుకున్న క్రీడల్లో ప్రతిభ చాటుతున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని నందిని చెప్పుకొచ్చింది.