హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిథులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నల్లగొండ కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు నల్లగొండ క్లాక్టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేటలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. అమరులకు నివాళులు అర్పించిన ఆయన కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.
మెదక్ జిల్లాలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు చిన్న శంకరంపేటలో అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన ఎందరో మాహానీయుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. అమరుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధిపథంలో సాగుతున్న తరుణంలో కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృంభించిందని, ప్రజల ప్రాణాలను బలిగొంటూ, వ్యాధిగ్రస్తులను చేస్తూ ఆర్ధిక వ్యవస్థను కుదేలు చేసిందని చెప్పడానికి ఎంతో బాధ కలుగుతున్నదని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మహబూబాబాద్లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించి, కలెక్టర్ కార్యాలయంలో జెండా వందనం చేశారు.
నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్.. జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి, అమర వీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడులు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నిబంధనలకు అనుగుణంగా జరిగిన ఈ వేడుకలకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.