హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్లను ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారమే పరిశీలించి, కేంద్ర జల సంఘానికి పంపాలని లేఖలో కోరారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, తుపాకుల గూడెం, సీతారామ ఎత్తిపోతల పథకం, మోడికుంట వాగు ప్రాజెక్టులు కొత్త కావని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించిన ప్రాజెక్టులనీ, ఇవి విభజన చట్టం పరిధిలోకి రావని పేర్కొన్నారు.
ఆయా ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన 967.94 టీఎంసీల్లో భాగంగానే ఉన్నాయని, ఇవి ఏపీ నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఉమ్మడి రాష్ట్రం చేపట్టినవని..డీపీఆర్లలో ఇరిగేషన్ ప్లానింగ్, అంచనా విలువలు, డిజైన్, నీటి లభ్యత తదితర సాంకేతిక అంశాలను పరిశీలించే అధికారం జీఆర్ఎంబీకి లేదని.. ఇందుకు కేంద్ర జలసంఘంలో ప్రత్యేకమైన డైరెక్టరేట్లు ఉన్నాయన్నారు.
కేఆర్ఎంబీ గతంలో రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని పరిశీలించడానికి నేరుగా కేంద్ర జలసంఘానికి పంపించిందని, డీపీఆర్ల పరిశీలనలో రెండు బోర్డులు భిన్న పద్ధతులు అవలభిస్తున్నాయన్నారు. పూర్తయిన, కొనసాగుతున్న ప్రాజెక్టుల డీపీఆర్లకు సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర జలసంఘానిదేనని, బోర్డులది కాదని స్పష్టం చేశారు. రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా కేంద్ర జలశక్తి మంత్రి డీపీఆర్లను త్వరితగితన పరిశీలించి ఆమోదం తెలుపుతామని హామీ ఇచ్చారని గుర్తు చేరశారు. వెంటనే గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్లను కాలయాపన చేయకుండా వెంటనే కేంద్ర జల సంఘానికి నివేదించాలని విజ్ఞప్తి చేశారు.