హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భేటీలో అదనపు నిధుల సమీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం రుణాలు సమీకరించుకోవడానికి అనుమతులు ఇవ్వకుండా తెలంగాణను కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనపు వనరులను ఏవిధంగా సమీకరించాలనే విషయంపై మంత్రివర్గం చర్చించనున్నది.
దీంతోపాటుగా వృద్ధాప్య పింఛన్ల వయసు 57 ఏండ్లకు తగ్గింపు, డయాలసిస్ పేషంట్లకు ఆసరా, అనాథ పిల్లల సంరక్షణకు పాలసీ, స్వతంత్య్ర వజ్రోత్సవాల వేళ సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదల, తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశమున్నది. ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణ, మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నది.