KTR | సిటీబ్యూరో: పదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో నగర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 2014లో బడే భాయ్ మోదీ ఎన్నో హామీలిచ్చారని.. రూ. 15 లక్షలు, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, బుల్లెట్ ట్రైన్లు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి ఒక్కరికీ ఇండ్లు అని చెప్పి.. ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్కు మద్దతుగా కేటీఆర్ ప్రచారం నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని కొండాపూర్, రాజేంద్రనగర్లోని శంషాబాద్ బస్టాండ్, మహేశ్వరంలోని బడంగ్పేట గాంధీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లలో కేటీఆర్ ప్రసంగించారు. ముస్లింపై మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, పదేండ్లుగా ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని, దేశంలోనే అత్యంత సామరస్యంగా ఉండే నగరాల్లో హైదరాబాద్ ఒక్కటిగా నిలిపామని కేటీఆర్ వివరించారు. ఇలాంటి హైదరాబాద్ నగరాన్ని మోదీ ఆగం చేయాలని చూస్తున్నారని, నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి.. లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని కేటీఆర్ అన్నారు. 2014, 2019లో బీజేపీ గెలుపును అడ్డుకున్నది కేసీఆర్ మాత్రమేనని, 2023లో కూడా బీజేపీలోని పెద్ద పెద్ద లీడర్లను కూడా ఓడించింది కూడా బీఆర్ఎస్సేనని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది ఒక్క బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు.
పొరపాటున కాంగ్రెస్కు ఓటు వేస్తే.. అది బీజేపీకి వేసినట్టే అవుతుందని, ఎన్నికలయ్యాక రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ చెప్పారు. రేవంత్రెడ్డిని నమ్ముకుంటే ఒక్క హామీ కూడా అమలు కాదని, తులం బంగారం రాదు, మహిళలకు రూ. 2500లు, పింఛన్ రూ.4వేలు, కనీసం స్కూటీలు కూడా రావని ఎద్దేవా చేశారు.‘ఇచ్చిన హామీలు అమలు చేయని రేవంత్రెడ్డికి, కాంగ్రెస్ సర్కారుకు కర్రుకాల్చి వాత పెట్టాలె’.. అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు, తాగునీటి గోసలు వచ్చాయని, రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు. కాంగ్రెస్ సర్కారుకు కొత్త కంపెనీలను తీసుకొచ్చే ముఖం లేదని, ఉన్న కంపెనీలు గుజరాత్, చెన్నైకి తరలిపోతున్నాయన్నారు. చిల్లర మాటలు, ఉద్దెర పనులే తప్ప.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం సీఎం రేవంత్రెడ్డితో కాదన్నారు. ‘కాంగ్రెస్ తెచ్చిన మార్పు బాగాలేకపోతే ఆ పార్టీని చీరి చింతకు కట్టేయాలే’ అని అన్నారు. 96 బీసీ కులాలను ఏకం చేసిన కాసానిని గెలిపించుకొని బీసీల చైతన్యం చూపాలన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆరే సీఎంగా ఉండాలని గ్రేటర్ ప్రజలు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు. 16 సీట్లు ఇచ్చినందుకు హైదరాబాద్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించడంతో జిల్లాల్లో ప్రజలు కాస్త ఆగమయ్యారని.. అయితే మనసు నిండా కేసీఆర్ మీద ప్రేమ ఉన్నదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అనుకునేవాళ్లంతా 13న కారు గుర్తుపై ఓటేసి.. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10-12 సీట్లు అప్పజెప్పితే.. ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు సీనియర్ నాయకులు కార్తిక్రెడ్డి, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.