నిజామాబాద్, జనవరి 27: దళితబంధు పథకం నిరుపేదలను అత్యున్నతస్థాయికి తీసుకొచ్చే ఉద్యమంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అభివర్ణించారు. వంద శాతం రాయితీతో రూ.10 లక్షలు ఇచ్చే పథకం దేశంలో ఎక్కడా లేదని కితాబిచ్చారు. నిత్యం పేద ప్రజలు, రైతుల కోసమే ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ పథకం అమలుతో కేసీఆర్ చరిత్రలో అభినవ అంబేద్కర్గా నిలిచిపోతారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 100 యూనిట్లు దళితబంధు అమలు కాబోతుండటం సంతోషంగా ఉన్నదని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో స్వయంగా పాల్గొంటానని చెప్పారు. దళితబంధు పథకంపై స్పీకర్ పోచారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లో..
లోన్ కోసం తిరిగినా వచ్చేది కాదు
దేశంలోనే మొట్టమొదటిసారిగా నూటికి నూరు శాతం సబ్సిడీతో పేదలకు ఉపాధి కల్పించే బ్రహ్మాండమైన పథకం దళితబంధు. 75 ఏండ్లలో ఎప్పుడూ చూడని స్కీం. గతంలో లక్ష రూపాయలు కావాలంటే రూ.20 వేలు రాయితీ ఇచ్చేది. మిగిలిన రూ.80 వేలు బ్యాంకు లోన్ కోసం 80 సార్లు తిరిగితే కూడా వచ్చేది కాదు. దీంతో అనుకున్న ఆశయాలు నెరవేరేవి కావు. దళితబంధు పేరుతో రూ.10 లక్షలు ఇవ్వడం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఒకేసారి రూ.10 లక్షలతో ఇష్టమైన, తెలిసిన పనులతో ఉపాధి పొందొచ్చు. ఇందులో వడ్డీ లేదు. తిరిగి రుణం కట్టేదీలేదు. రుణం కట్టాల్సి ఉంటే తెల్లారి నుంచి బ్యాంకు నోటీసులు వస్తయి. అప్పటికి లబ్ధిదారులు రూపాయి సంపాదించి ఉండరు. కానీ ఈ పథకం మాత్రం పది లక్షలు పూర్తి రాయితీతో ఇస్తున్నది. ఇది దేశంలోనే అరుదైన పథకం.
విమర్శకులకు జవాబిదీ
హుజూరాబాద్ నుంచి ఈ పథకం ప్రారంభమైంది. మొదటి పథకం కాబట్టి ఒకేసారి అమలుచేయడం టెక్నికల్గా ఇబ్బంది ఉంటుంది. మంచీచెడ్డా చూడాల్సి ఉంటుంది. మెల్లమెల్లగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. కొంతమంది ఇది కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే తెచ్చారన్నారు. ఎన్నికల తర్వాత ఇవ్వరనే విమర్శలకు ఇదొక జవాబు. మాకు రాని ఆలోచన కేసీఆర్కు వచ్చింది. రేపు ప్రజలు మద్దతు తెలుపుతారేమో. అప్పుడు మా పరిస్థితి ఏంటో అనే బాధ వారిలో ఉన్నది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. ఇంతకంటే మంచి పథకం తీసుకురావాలి కదా. అక్కడా ఉన్నది ప్రభుత్వమే. ప్రైవేటు దుకాణమేమీ కాదు. వారి ప్రభుత్వం ద్వారా దేశంలో, రాష్ట్రంలో కొత్త పథకాలు తెస్తామనే ఆలోచన చేయరు. రోజూ విమర్శలు చేస్తుంటే బాధ కలుగుతున్నది. స్పీకర్ హోదాలో రాజకీయాలు మాట్లాడటం కష్టమయినప్పటికీ, విమర్శలు చేసేవారు ఓ సారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతున్నాను. మైక్ పట్టుకొని చెప్తే తెలంగాణ పథకాలను వివరించేందుకు గంటల సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలైతే ఒక్కటీ చెప్పలేం. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారు. వాళ్లు ప్రజలకు చెప్పుకొనేది ఏమీ లేదు. ప్రజల ముందు నిలబడలేక రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
రాజకీయాలకు అతీతంగా అమలు
పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. ఎస్సీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను గుర్తించినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మండలాన్ని కూడా ప్రభుత్వం ఎంపికచేసింది. 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత మంచి ప్రభుత్వ పరిపాలనను మొదటి సారి చూస్తున్నా. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులు, ప్రధానులను చూశా. కానీ పేదలు, రైతుల కోసం పరితపించే వ్యక్తి కేసీఆర్. అసూయతో రాజకీయాలు చేయొద్దు. పోటీపడి పనిచేయాలి. ఒక రాష్ట్రంలో ఇంత మంచి పని చేస్తుంటే… ఇతర పార్టీలు వాళ్లు అధికారంలో ఉన్న చోట ఇలాంటి పథకాలు తెచ్చేందుకు పోటీపడాలి. అంతేకానీ పనిచేసేవారి కాళ్లలో కట్టెలు పెట్టవద్దు. పనిచేయకుండా అడ్డుపడేవారి పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గుతుంది. తెలంగాణలో 24 గంటల కరెంట్, రైతుబంధు, పెన్షన్లు ఇస్తున్నాం. కల్యాణలక్ష్మి ఎక్కడా లేదు. తమిళనాడులో తెలంగాణ స్ఫూర్తితో మొన్ననే ప్రకటించారు. మీరు కూడా మీ రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న చోట ఈ పథకాలు అమలుచేయాలని ఒత్తిడి చేయండి. లేదంటే తెలంగాణకు సాయం చేయాలని చెప్పండి. సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలి. అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ పనిచేస్తున్నారు. దళితబంధు అమలుతో అభినవ అంబేద్కర్గా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు.
ఉద్యమంలా దళితబంధు
దళితబంధు ఉద్యమంలా జరుగుతున్న కార్యక్రమం. ఇందులో ప్రభుత్వం, నాయకుల జోక్యం లేదు. ఇష్టమొచ్చిన యూనిట్ తీసుకొని లబ్ధిదారులు ఉపాధి పొందవచ్చు. ఇచ్చిన రూ.10 లక్షలను ఏడాదిలో 15 లక్షలు చేయాలే తప్ప, 5 లక్షలకు తగ్గించుకోవద్దు. నియోజకవర్గానికి 100 యూనిట్లు తొలిదఫాలో అమలు చేయబోతుండటం, బడ్జెట్లో రూ.25వేల కోట్లు కేటాయిస్తామనడం సంతోషం. నిరుపేదలైపన దళితులను అత్యున్నతస్థాయికి తీసుకొచ్చేందుకు సీఎం పాటుపడుతున్నారు. చెప్పిన మాటను నెరవేర్చడం కేసీఆర్కు అలవాటు. బాన్సువాడ నియోజకవర్గంలోనూ వంద మంది అర్హులను ఎంపికలో స్వయంగా పాల్గొంటా. పైరవీకారులు, మధ్యవర్తుల పాత్ర లేకుండా కచ్చితత్వంతో, పారదర్శకంగా ఎంపిక చేపడతాం.