న్యూఢిల్లీ: మరోసారి కాంగ్రెస్ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. నిన్న లోక్సభలో ఆ పార్టీ తీరును ఖండించిన మోదీ.. ఇవాళ రాజ్యసభలో ఆ పార్టీని నిలదీశారు. ఏపీ విభజన సమయంలోనూ కాంగ్రెస్ సరైన రీతిలో వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. మైక్లు బంద్ చేసి.. పెప్పర్ స్ప్రే చేసి.. చర్చ లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని, ఇంత గందరగోళం క్రియేట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అహంకారమే కారణమని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. సరైన పద్ధతిలో తెలంగాణ, ఏపీ విభజన జరగలేదన్నారు. రాష్ట్ర విభజనకు తాము ఏమీ వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాల మధ్య ప్రచ్ఛన్న పరిస్థితులు నెలకొన్నట్లు మోదీ ఆరోపించారు. అటల్జీ మూడు రాష్ట్రాలను విభజించారని, కానీ చాలా శాంతిపూర్వకంగా ఆ రాష్ట్రాల విభజన జరిగినట్లు మోదీ చెప్పారు.
కుటుంబ పాలన కన్నా ఎక్కువ ఏదీ లేదన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ప్రధాని మోదీ విమర్శించారు. భారత ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదం డైనాస్టిక్ పార్టీలు అని, ఆ ప్రమాదాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. పార్టీలో ఏదైనా కుటుంబం కీలకమైతే, అప్పుడు ట్యాలెంట్ ఉన్నవాళ్లు బలికావాల్సిందే అని ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ తరహాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన మారిందన్నారు. ఇది దేశాం చింతించే విషయమన్నారు.
కాంగ్రెస్ లేకుంటే, దేశం ఏమయ్యేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇండియా అంటే ఇందిర.. ఇందిర అంటే ఇండియా అన్న ఆలోచనలు ఉండేవని, కాంగ్రెస్ ఉంటే దేశానికి ఏమౌతుందో గాంధీకి తెలుసు అని, అందుకే ఆ పార్టీని నిర్వీర్యం చేయాలని గాంధీ భావించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మహాత్మా గాంధీ ఆశించినట్లు కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి ఉంటే.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం విముక్తి అయ్యేదన్నారు. జాతీయ తీర్మానాల దిశగా దేశం ముందుకు వెళ్లేదన్నారు.
కాంగ్రెస్ లేకుంటే.. దేశంలో ఎమర్జెన్సీ ఉండేది కాదని ప్రధాని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే అప్పడు సిక్కుల ఊచకోత ఉండేది కాదన్నారు. ఉగ్రవాద కోరల్లో పంజాబ్ దగ్ధం అయ్యేది కాదన్నారు. కశ్మీర్ పండిట్లు కశ్మీర్ను వదిలి వెళ్లేవారుకాదన్నారు. కాంగ్రస్ పాలనలో లేకుంటే ఈ దేశ ఆడపడుచుల్ని తందూర్లో వేసేవాళ్లు కాదని మోదీ విమర్శించారు.
ప్రధాని మోదీ విరుచుకుపడ్డ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానం ఇవ్వకుండా.. కాంగ్రెస్ పార్టీని నిందించడమే పనిగా ప్రధాని మాట్లాడుతున్నారని ఖర్గే ఆరోపించారు.