హైదరాబాద్, జనవరి 30 : వ్యవసాయరంగంలో రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదలను నమోదు చేసింది. గతంతో పోల్చితే సుమారు 60 శాతం ఎగుమతులు పెరగడం గమనార్హం. 2019-20లో రాష్ట్రం నుంచి ఎగుమతి అయిన వ్యవసాయ ఉత్పత్తుల విలువ రూ.2,692.15 కోట్లు. అవి 2020-21 నాటికి రూ.4,180.1 కోట్లకు పెరిగాయి. దాదాపు ముఖ్యమైన అన్ని ఉత్పత్తుల ఎగుమతుల్లో పెరుగుదల నమోదైంది. మొత్తం 11 ఉత్పత్తుల్లో ఎగుమతులు పెరిగినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో సుగంధ ద్రవ్యాలు మొదటి స్థానంలో నిలువగా పత్తి, బియ్యం ఎగుమతులు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సుగంధ ద్రవ్యాలు 2019-20లో రూ.887.44 కోట్ల ఎగుమతులు కాగా, 2020-21లో రూ.1464.10 కోట్లకు పెరిగింది. పత్తి ఎగుమతులు 2019-20లో రూ.465.43 కోట్లు ఉండగా, 2020-21లో రూ.1,056.09 కోట్లకు పెరిగింది. బియ్యం ఎగుమతులు 2019-20లో రూ.633.40 కోట్లు కాగా 2020-21లో రూ.911.92 కోట్లకు పెరిగింది. వాణిజ్య పంటల ఉత్పత్తుల ఎగుమతులు పెరగగా కూరగాయలు, పప్పులు, పండ్ల ఎగుమతులు తగ్గడం గమనార్హం. అదే సమయంలో పండ్ల, కూరగాయల విత్తనాల ఎగుమతులు పెరగడం విశేషం. 2019-20లో రూ.193.81 కోట్ల విలువైన విత్తనాలు ఎగుమతి అయితే.. 2020-21లో రూ.200.63 కోట్ల విలువైన విత్తనాలు ఎగుమతి అయ్యాయి.
ఫలించిన ప్రభుత్వ చర్యలు
వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. ఇందుకు ఎగుమతుల పెరుగుదలే ఉదాహరణ. గత రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పత్తితో పాటు ఇతర పంటలను ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే 2020-21లో ఏకంగా 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, వానకాలంలో వరి 53 లక్షల ఎకరాల్లో, యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందుకు అనుగుణంగానే ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఉత్పత్తి పెరగడంతో ఎగుమతుల్లో పెరుగుదల నమోదైంది. కరోనా సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసింది. ప్రభుత్వం సూచించిన ప్రతి పంటకు సంబంధించి ఎగుమతులు పెరిగాయి.