చెన్నై : వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ పరీక్ష నీట్ మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుందనగా ఆదివారం ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలంలో చోటు చేసుకున్నది. మృతుడిని ధనుష్గా పోలీసులు గుర్తించారు. మృతుడు ఇంతకు ముందు రెండుసార్లు నీట్కు హాజరయ్యాడు. అయితే, కోర్సులో ప్రవేశానికి అవసరమైన మార్కులు సాధించలేకపోయాడు. ఈ సంవత్సరం సైతం నీట్కు దరఖాస్తు చేసుకుంటున్నాడు.
పరీక్షకు సిద్ధం కావాలని కోరుకుంటున్నందున తనను ఇబ్బంది పెట్టవద్దని తన కుటుంబ సభ్యులను కోరాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ధనుష్ను నిద్ర నుంచి లేపేందుకు కుటుంబీకులు వెళ్లగా.. గదిలో గడియ వేసి ఉంది. ఎంతకీ తెరకపోవడంతో బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ధనుష్ గదిలో పైకప్పుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతన్ని కిందికి దించి మెట్టూరులోని ఆసుప్రతికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతుడి సోదరుడు మాట్లాడుతూ ధనుష్ పది, 12 తరగతిలో మంచి మార్కులు సాధించాడని, రెండు సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ నీట్లో మంచి మార్కులు సాధించకపోవడంపై మనస్తాపానికి గురయ్యాడని తెలిపాడు. ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి మృతి వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. నీట్ నుంచి ‘శాశ్వత మినహాయింపు’ కోసం అసెంబ్లీలో తీర్మానం ఆమోదించనున్నట్లు తెలిపారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో నీట్కు వ్యతిరేకంగా తీర్మానం తీసుకురానున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.