ఒక్కో యూనిట్ ఖర్చు: 52 లక్షలు
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన జిల్లాలు 8
ఒక్కో యూనిట్ ద్వారా
లబ్ధిపొందే కుటుంబాలు: 200
రజక సంఘానికి నెలకు
వచ్చే ఆదాయం: రూ.20 వేలకుపైనే
ఒక్కో వృత్తిదారుని
నెలవారీ ఆదాయం: రూ.5-10 వేలు
ఒక్కొక్కటి 60 కేజీల సామర్థ్యం
కలిగిన 2 వాషర్లు
ఒక్కొక్కటి 30 కేజీల సామర్థ్యం
కలిగిన 2 హైడ్రో ఎక్స్ట్రాక్టర్లు
ఒక్కొక్కటి 30 కేజీల సామర్థ్యం కలిగిన
2 డ్రయ్యర్లు 4 మాన్యువల్ ఐరన్ టేబుల్స్
హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో పూర్తిగా ఉనికినే కోల్పోయిన కులవృత్తుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత దాదాపు రూ.30 కోట్లతో 644 ధోబీఘాట్లను నిర్మించింది. ఒక్కో ధోబీఘాట్కు 250 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ను అందిస్తూ 2 లక్షల మంది రజకులకు ప్రయోజనం కల్పించింది. అంతటితో ఆగకుండా రజక వృత్తికి టెక్ సొబగులను అద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. ఓవైపు అధునాతన డ్రైక్లీనింగ్ యంత్రాల నిర్వహణపై వృత్తిదారులకు శిక్షణ ఇప్పిస్తూనే.. మరోవైపు ఆధునిక ధోబీఘాట్లను భారీగా నిర్మిస్తున్నది.
మురికి నీళ్లతో బట్టలను ఉతికే విధానానికి తెర దించి, రజకవృత్తిదారులను ఆధునిక టెక్నాలజీ వైపు మళ్లించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి 20 మంది చొప్పున రజక ప్రతినిధులతో హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం రాష్ట్ర రజక ఫెడరేషన్ ద్వారా 11 జిల్లాల నుంచి 18 మందిని ఎంపికచేసి మూడు రోజుల స్టడీ టూర్ కోసం బెంగళూరుకు తీసుకెళ్లింది. అక్కడ మల్లేశ్వరం, శ్యాంరాజుపేట, చాటరాయినిపురలోని ఆధునిక లాండ్రీల పనితీరు, వాటి ద్వారా ఉపాధి పొందుతున్న వృత్తిదారులపై అధ్యయనం చేయించి, రాష్ట్రంలో కూడా ఆధునిక డ్రైక్లీనింగ్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద 8 జిల్లాలను, రెండు మున్సిపాలిటీలను ఎంపికచేసి ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. బట్టలు పిండటం, ఆరబెట్టడం లాంటి పనులన్నీ యంత్రాల ద్వారానే నిర్వహించేలా వీటిని తీర్చిదిద్దుతున్నది.
మోడ్రన్ లాండ్రీల నిర్మాణానికి తెలంగాణ రజక ఫెడరేషన్ ద్వారా ఒక్కో యూనిట్కు రూ.52.04 లక్షల చొప్పున మంజూరు చేసింది. హైదరాబాద్ యూనిట్కు రూ.65 లక్షలు ఖర్చు చేసింది. దీనికి అదనంగా స్థానిక ప్రజాప్రతినిధులు మరిన్ని నిధులు కేటాయించారు. వీటిలో రూ.17 లక్షలను మెషినరీ కోసం, మిగిలిన మొత్తాన్ని విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్, బోర్, మోటర్, శానిటేషన్, సిమెంట్ బెడ్, ఇతర వసతుల కల్పనకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆధునిక ధోబీఘాట్లు అందుబాటులోకి వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల కూడా తుదిదశకు చేరుకొన్నాయి. ప్రస్తుతం ఆధునిక ధోబీఘాట్లను ప్రతి జిల్లాకూ విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
ఆధునిక ధోబీఘాట్ల నిర్వహణ బాధ్యతలను రజక సొసైటీలకు అప్పగించిన ప్రభుత్వం.. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నది. ఆధునిక ధోబీఘాట్ల ద్వారా అటు సొసైటీకి ఆదాయం సమకూరడమే కాకుండా వృత్తిదారులకూ లబ్ధి చేకూతున్నది. రజకులు రోజువారీగా ఇండ్ల నుంచి సేకరించిన బట్టలను ధోబీఘాట్కు తీసుకెళ్లి అప్పగిస్తున్నారు. ఆ తర్వాత ఉతికిన బట్టలను తీసుకెళ్లి ఇండ్లలో అప్పగిస్తున్నారు. ఇలా ఒక్కో షిఫ్టులో 200 మంది చొప్పున రెండు షిఫ్టుల్లో 400 మందికి ఉపాధి లభిస్తున్నది. తద్వారా ఒక్కో వ్యక్తికి నెలకు రూ.5 నుంచి 10 వేల వరకు వస్తున్నది. ఖర్చులన్నీ పోగా ఒక్కో సంఘానికి రూ.20-30 వేలు వస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.
రజకవృత్తిదారులను ఇప్పటి దాకా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే మాకు భరోసా లభించింది. ఆధునిక దోభీఘాట్ల నిర్మాణానికి పూర్తి సబ్సిడీతో రూ.52 లక్షల చొప్పున మంజూరు చేయడం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ ప్రోత్సాహంతో మా వారసులు కూడా కులవృత్తిని స్వీకరించటానికి ముందుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– కొండూరు సత్యనారాయణ, ముఖ్య సలహాదారు, తెలంగాణ రజక సంఘాల సమితి
యాంత్రిక దోభీఘాట్లతో మాకు ఎంతో లాభం చేకూరుతున్నది. శారీరక శ్రమ చాలా వరకు తగ్గిపోయింది. బట్టలను తీసుకెళ్లడం, సంఘానికి అప్పగించడం.. పిండిన తర్వాత వాటిని తీసుకురావడమే మా పని. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన దోభీఘాట్ ద్వారా 250 కుటుంబాలకు మేలు జరుగుతున్నది. ఒక్కొక్కరికి రూ.5-8 వేల వరకు ఆదాయం వస్తున్నది. మా సంఘానికి రూ.20 వేల వరకు మిగులుతున్నది.
– శ్రీనివాస్, ఆధునిక యాంత్రిక దోభీఘాట్ రజక సంఘం, సిద్దిపేట