రైతుబంధు పథకంతో రైతుల జీవితాల్లో మార్పులు
రైతురాజ్యం ఆవిష్కృతమైంది
ఇక్కడ పండని పంట అంటూ ఉండదు
ధాన్యం సేకరణలో కేంద్ర వివక్ష
పంజాబ్కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా?
టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్, జనవరి 10 : వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టించిందని, రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత రైతు రాజ్యం ఆవిష్కృతమైందని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేయడం దేశ చరిత్రలో కొత్త అధ్యాయమని, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది మార్గం చూపించిందని కొనియాడారు. సోమవారం ఆమె ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని తెలిపారు. వ్యవసాయం కొత్తపుంతలు తొక్కిందని, కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ తదితర ప్రాజెక్టులు నిర్మించి రైతుల గడపలోకి నీళ్లు ఇచ్చారని అన్నారు. ఉచిత విద్యుత్తుతోపాటు రైతుకు అదనపు ఆదాయ వనరులుగా బర్రెలు, గొర్రెలు ఇవ్వటం అద్భుతమని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో వ్యవసాయం నిజంగా పండుగలా ఉన్నదని కొనియాడారు. సీఎం కేసీఆర్ దీక్షా, దక్షతతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు సొమ్మును రైతులు వ్యక్తిగత అవసరాలకు వాడుకోకుండా వ్యవసాయానికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రాష్ర్టానికో విధానమేల?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో విధానం అమలు చేస్తున్నదని ప్రసూన విమర్శించారు. దాన్యం సేకరణ విషయంలో పంజాబ్లో ఎలాంటి విధానం ఉన్నదో తెలంగాణలో కూడా అదే విధానం ఉండాలని స్పష్టంచేశారు. తెలంగాణలో ఈసారి డిమాండ్ను మించి పంట దిగుబడి ఉన్నదని, దీన్ని సేకరించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని పేర్కొన్నారు. హక్కుల కోసం కేంద్రంపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాట్రగడ్డ ప్రసూన హైదరాబాద్ శివారులో ఏడెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని మోడల్గా తయారు చేశారు. కేవలం మంచు ప్రాంతాల్లోనే పండే రుద్రాక్ష వంటి అనేక పంటలను ప్రయోగాత్మకంగా ఈ క్షేత్రంలో పండిస్తున్నారు. తెలంగాణ నేల అద్భుతమని, ఇక్కడ పండని పంట అంటూ లేదని తెలిపారు. ఏడెనిమిదేండ్ల క్రితం నాటిన రుద్రాక్ష మొక్కలు ఇప్పుడు కాస్తున్నాయి. రుద్రాక్షలు ఏడాదికి ఒక్క పంటే వస్తుందని, తమ వ్యవసాయక్షేత్రంలో రెండు సీజన్లలో పంట వస్తున్నదని చెప్పారు. యాలకులు, లవంగాలు, బిర్యాణీలో వేసే మరాఠా మొగ్గ, బిర్యాణీ ఆకులు కూడా పండుతున్నాయని తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలను వదిలి ఇతర పంటల వైపు దృష్టిసారిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రంగారెడ్డి, నల్లగొండ, జహీరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉల్లి, వెల్లుల్లి, మినుములు, జనుము పండుతుందని తెలిపారు. ఒకప్పుడు ఆంధ్రలోని డెల్టా ఎలా ఉండేదో, ఇప్పుడు తెలంగాణ మొత్తం అలా ఉన్నదని అన్నారు. తెలంగాణ వ్యవసాయరంగంలో మూడు విప్లవాలు గ్రీన్ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్, వైట్ రివల్యూషన్ వచ్చాయని చెప్పారు. ఇంత తక్కువ సమయంలో దీన్ని సాధించడం గొప్పవిషయమని కొనియాడారు.