అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్పై ప్రసంగించేందుకు అసెంబ్లీకి రాగా ఏపీ సీఎం జగన్, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్వాగతం పలికారు. ముందుగా జాతీయ గీతంతో సమావేశాలను ప్రారంభించిన అనంతరం గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే ప్రతిపక్ష టీడీపీ సభ్యులు నిరసనలు, నినాదాలు చేశారు.
రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని , రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్..గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ బడ్జెట్ ప్రతులను చింపివేశారు. దీంతో ఏపీ సీఎం జగన్ తన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ షెడ్యూల్ను ఖరారు చేస్తారు.బడ్జట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. కాగా, సమావేశాలను ఈనెల 26 వరకు నిర్వహించే అవకాశం ఉన్నది.