హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ కావాలంటే టాటూ ఉండాలి. ఏ టాటూ పడితే ఆ టాటూ కాదు.. దానికంటూ ఓ సపరేటు డిజైన్ ఉంటుంది. అది మాదక ద్రవ్యాల నెట్వర్క్లో ప్రత్యేక కోడ్. డ్రగ్స్ తీసుకొనేవారిలో 90 శాతం మందికి టాటూలు ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ టాటూలు కూడా ఒకే రకంగా ఉన్నట్టు తేలింది. పబ్లలో డీజేగా పనిచేసేవారే ఎక్కువగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు తెలిసింది. వీరి శరీరంపైనా టాటూలను పోలీసులు గుర్తించారు. పబ్లకు వచ్చే కస్టమర్లను పరిశీలించేది వీరే. కస్టమర్లతో సత్సంబంధాలుంటాయి. దీన్నే మాదక ద్రవ్యాల విక్రేతలు ఆసరాగా చేసుకొంటున్నట్టు వెల్లడైంది. డీజేలు కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడటమే కాకుండా స్మగ్లర్లతో చేతులు కలిపి కమీషన్లు తీసుకొంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
గురువారం హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) పోలీసులు ప్రేమ్ ఉపాధ్యాయ్, శ్రీరామ్ అనే డ్రగ్స్ విక్రేతలను వేర్వేరు ఘటనల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి వద్ద నుంచి డ్రగ్స్ తీసుకొంటున్న దీపక్ కుమార్ జాదవ్, రామకృష్ణ, నిఖిల్ జాస్వ, జీవన్రెడ్డిని అదుపులోకి తీసుకొన్నారు. శ్రీరామ్ యూట్యూబ్లో చూసి డ్రగ్స్ను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ప్రేమ్ ఉపాధ్యాయ్కు హైదరాబాద్కు చెందిన లక్ష్మీపతి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. లక్ష్మీపతి ప్రస్తుతం గోవాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించి గాలింపు చేపట్టారు. అతడికి 50 మంది డ్రగ్స్ విక్రేతలతో సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలింది. అందులో ప్రేమ్ఉపాధ్యాయ్ ఒకడు. ఇతడితో కలిసి తిరిగిన అశోక్నగర్కు చెందిన యువకుడే డ్రగ్స్కు బానిసై మృతిచెందాడు. ప్రేమ్ నెట్వర్క్ను ఛేదించగా 9 మందికి దగ్గరి సంబంధాలున్నట్టు తేలగా, ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్లో ఉన్న వారందరి చేతులు, భుజాలు, ఛాతిపై టాటూలు ఉన్నాయి. వీరు తరచూ గోవా వెళ్లి మత్తులో జోగుతున్నట్టు వెల్లడైంది.
డ్రగ్స్ కోసం గోవాకు..
హైదరాబాద్లో మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపటంతో కొందరు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు గోవా, హిప్పీ ఐలాండ్, ముంబై, బెంగళూరు బాట పడుతున్నారు. సరదా కోసం అలవాటు చేసుకొని, బానిసలుగా తయారై ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. డార్క్నెట్ కూడా మత్తు దందాకు పెద్ద వేదికగా మారింది. యువత దీనిలో బిట్కాయిన్ల రూపంలో డ్రగ్స్ కొంటున్నది. ఇటీవల గాజుల రామారానికి చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సాయివిగ్నేశ్ డార్క్నెట్ ద్వారా ఎల్ఎస్డీ బ్లాట్స్ను తెప్పించి ఫ్రెండ్స్కు దావత్ ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు పట్టుబడ్డ వారిలో విద్యార్థులు, యువతే ఎక్కువగా ఉండటం గమనార్హం.
పోలీసులకు చిక్కడంతో తప్పిన ప్రాణాపాయం
మత్తు పదార్థాలు వాడుతూ చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. వారం కిందట అఫ్జల్గంజ్ పోలీసులతో కలిసి హెచ్న్యూ పోలీసులు డ్రగ్స్ విక్రేత అష్తోష్ను అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేసే సమయానికి మత్తుకు పూర్తిగా బానిసై, ఆరోగ్యం క్షీణించింది. వింత చేష్టలు చేశాడు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నది. అతడు పట్టుబడకపోయి ఉంటే అష్తోష్ ప్రాణాలకే ముప్పు ఉండేదని పోలీసులు తెలిపారు.
డిమాండ్, సైప్లె గొలుసుపై దృష్టిపెట్టాం
డ్రగ్స్ సరఫరాపై సర్కారు సీరియస్గా ఉన్నది. వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలని దిశానిర్దేశం చేసింది. హెచ్న్యూ ఆధ్వర్యంలో డ్రగ్స్ దందాపై నిఘా కొనసాగుతున్నది. ముఖ్యంగా డిమాండ్, సైప్లె గొలుసుపై దృష్టి పెట్టాం. ప్రేమ్ ఉపాధ్యాయ్ను అరెస్ట్ చేసి అతని నెట్వర్క్పై దృష్టి సారించగా, నిమ్స్లో చేరిన యువకుడి విషయం తెలిసింది. అప్పటికే అతడి శరీరంలోకి అధిక మొత్తంలో డ్రగ్స్ వెళ్లడంతో అన్ని అవయవాలు దెబ్బతిని ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టాలి. నిత్యం వారి వ్యవహారశైలిని గమనిస్తూ ఉండాలి.
–చక్రవర్తి గుమ్మి, డీసీపీ, హెచ్న్యూ ఇన్చార్జి
తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త