హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ నేతృత్వంలో టీబీజీకేఎస్ పోరాటంతోనే సింగరేణికి తాడిచర్ల బ్లాక్ దక్కిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు. ఈ బ్లాక్ ఘనత తమదేనని కాంగ్రెస్, బీజేపీలు చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణభవన్లో టీబీజీకేఎస్ నాయకులు కృష్ణ, సురేందర్తో కలిసి కొప్పుల విలేకరులతో మాట్లాడారు. 1995లో తాడిచెర్లను గుర్తించింది సింగరేణని స్పష్టంచేశారు. భవిష్యత్లో ఏ గనినైనా సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గతంలో తాడిచర్ల బ్లాక్ వేలాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకరించిన విషయాన్ని గుర్తుచేశారు. సెక్షన్ 17-ఏ ప్రకారం గనులను వేలం వేయొద్దని ప్రధాని మోదీకి ఉత్తరం రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎండీఆర్(మినరల్ మైనింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్) యాక్ట్తో సింగరేణి నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొన్నదని కొప్పుల ఈశ్వర్ వాపోయారు. నాడు వేలం ప్రక్రియ తెచ్చి సింగరేణికి బ్లాక్లు దక్కకుండా చేసిన పాపం మోదీ సర్కార్దేనని దుయ్యబట్టారు. పార్లమెంట్లో అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ చేతులెత్తిసిందని ఆరోపించారు. రోజురోజుకూ టీబీజీకేఎస్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకే కుట్రలకు దిగుతున్నారని తూర్పారబట్టారు. రెండు పార్టీల నాటకాలు సింగరేణి కార్మికులకు తెలుసని స్పష్టంచేశారు. చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్పరమైన గనులను తిరిగి సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకోవాలని, 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన వ్యవహారంలో దోషులెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
కేంద్రం ఎంఎండీఆర్ యాక్ట్ కింద వేలం పాటను పక్కనబెట్టి ఓపెన్ కాస్ట్(ఓసీ)గనులను నామినేషన్ పద్ధతిన సింగరేణికి కేటాయించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బొగ్గు గనుల వేలం నిర్ణయానికి బీఆర్ఎస్ తప్ప నాడు అన్ని పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతోనే నేడు తాడిచెర్ల బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కిందని స్పష్టంచేశారు. సాంకేతికత, మానవవనరుల వినియోగంలో సింగరేణి కోల్ ఇండియా కన్నా ముందంజలో ఉన్నదనే విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకొని అక్కడి ఏరియాలోని అన్ని బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చొరవచూపాలని కోరారు.
కేసీఆర్ అమలుచేసిన విప్లవాత్మక నిర్ణయాలతో బంగారు గనిగా రూపుదిద్దుకున్న సింగరేణి, కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల ఖనిగా మారిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సింగరేణిలో స్కామ్లకు సూత్రధారి రేవంత్రెడ్డి.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్రెడ్డి అని ఆరోపించారు. సీఎం బావమరిది కనుసన్నల్లోనే సింగరేణిలో అక్రమ వ్యవహారాలు నడుస్తున్నాయని విరుచుకుపడ్డారు. 16 వేల మందికిపైగా కారుణ్య నియామకాలు చేపట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందని కొనియాడారు. కానీ, కాంగ్రెస్ రెండున్నరేండ్లలో 330 మందికి వారసత్వ ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకొన్నదని ధ్వజమెత్తారు. సింగరేణిలో కాంగ్రెస్ పెద్దల స్కామ్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.