2021లో దేశంలోని రసాయన కంపెనీలలో 1.5 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగయ్యాయి. వాటిలో 35 శాతమైనా రీసైకిల్ చేయాలని పర్యావరణ శాఖ సూచిస్తున్నది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ గొలుసులోని అన్ని విభాగాలనూ ఒకే గొడుగు కిందికి తెస్తేనే ఇది సాధ్యం. ఆ బాధ్యత ‘బన్యన్ నేషన్’ తీసుకున్నది. అమెరికా వదిలి..
దేశంలో ప్లాస్టిక్ నిషేధం అమలులోకి వచ్చింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను ఇక తయారు చేయకూడదు. ఇయర్ బడ్స్, డెకొరేషన్ థర్మాకోల్, ప్యాకింగ్ బాక్స్లు, పీవీసీ బ్యానర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పాతాన్ని ముందే ఊహించి.. పదేండ్ల కిందటే ‘బన్యన్ నేషన్’ సంస్థను స్థాపించారు ఇద్దరు యువకులు.
మణి వాజ్పేయి, రాజ్ మదన్గోపాల్ ‘బన్యన్ నేషన్’ వ్యవస్థాపకులు. ఇద్దరూ అమెరికాలో ఉండేవారు. మణి వాజ్పేయి కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేస్తున్న రోజుల్లోనే స్టార్టప్ ఆలోచన చేశాడు. పర్యావరణం పట్ల ఆసక్తితో ప్లాస్టిక్ రీసైకిల్పై దృష్టిపెట్టాడు. మిత్రుడు రాజ్ మదన్గోపాల్కూ వ్యర్థాల నిర్వహణపై ఆసక్తి ఉండటంతో.. ఇద్దరూ చేతులు కలిపారు. వ్యర్థాల నిర్వహణపై మరింత పరిశోధన చేయడానికి హైదరాబాద్ వచ్చారు. బహుళజాతి కంపెనీల నిర్వాహకులు, మున్సిపల్ కమిషనర్లు, వేస్ట్ మేనేజ్మెంట్ కాంట్రాక్టర్లు, ప్రైవేట్ స్క్రాప్ కలెక్టర్లతో చర్చించారు. మూడు నెలలపాటు మార్కెట్ను అధ్యయనం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఒక వెంచర్ అవసరమని భావించారు. సేకరణ మొదలుకుని రవాణా, రీసైక్లింగ్ వరకు అంతా ఒకే గొడుగు కింద ఉంటే.. ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడంతోపాటు పర్యావరణాన్ని కాపాడవచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇద్దరూ తిరిగి అమెరికా వెళ్లిపోయారు. న్యూయార్క్, బే ఏరియాలో మూడు నెలలు పర్యటించారు. లక్షల జీతాల ఉద్యోగాలు వదిలేసి 2013 జులైలో భారత్కు తిరిగివచ్చి ‘బన్యన్ నేషన్’ వెంచర్ను స్థాపించారు. 2023 చివరి నాటికి సంవత్సరానికి వందకోట్ల రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిళ్లను అందించడమే సంస్థ లక్ష్యం. ఆ ప్రయత్నాలకు ‘వెంచర్ వరల్డ్ ఫోరమ్-గ్లోబల్ పయనీర్స్’ పురస్కారం, ప్రపంచ ఆర్థిక సదస్సులో పీపుల్స్ చాయిస్ అవార్డు వరించాయి.
50 శాతం వాడితే..
రీసైకిల్కు అవకాశం ఉన్న ప్లాస్టిక్ను కూడా రీసైకిల్ చేయకపోవడం వల్ల పర్యావరణ సంక్షోభం తలెత్తుతున్నది. ‘బన్యన్ నేషన్’ దీన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందిన సంస్థ. ‘బెటర్ ప్లాస్టిక్’ సాంకేతికతతో రీసైక్లింగ్ చేసి, ఆ ఉత్పత్తులను అవసరమైన సంస్థలకు అందిస్తుంది. పాలిథిన్ లేదా పాలిప్రొపిలీన్ వంటి అధిక సాంద్రత కలిగిన ప్లాస్టిక్ను రీసైకిల్ చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. అందుకే, బన్యన్ నేషన్ ప్రతి నెలా టన్నుల కొద్దీ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెసింగ్ వల్ల ప్లాస్టిక్లోని దుష్ప్రభావాలు చాలావరకు తొలగిపోతాయి. ప్రాసెసింగ్ తర్వాత క్లీనింగ్ టెక్నాలజీ ద్వారా ప్లాస్టిక్ను చిన్నచిన్న గుళికలుగా మారుస్తారు. ఉదాహరణకు సర్ఫ్ ఎక్సెల్ డబ్బాను పరిశీలిస్తే, దానిమీద ‘50% వర్జిన్ ప్లాస్టిక్, 50% రీసైకిల్ ప్లాస్టిక్’ అని రాసి ఉంటుంది. వర్జిన్, రీసైకిల్ ప్లాస్టిక్లను కలపడం ద్వారా ఎక్కువసార్లు రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంటుంది.
‘బన్యన్ నేషన్’ క్లయింట్స్ జాబితాలో హిందుస్థాన్ యూనిలీవర్, షెల్, హెచ్పీసీఎల్ వంటి కంపెనీలు ఉన్నాయి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియ దాదాపు ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లో ఉంది. దీంతో టన్నుల కొద్దీ వ్యర్థాలు పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి.ఆ వ్యర్థాలతో షాంపూ, డిటర్జెంట్స్, లోషన్ బాటిల్స్ వంటి ప్యాకేజింగ్ సామగ్రిని తయారుచేస్తుంది బన్యన్ నేషన్.