స్వచ్ఛ సర్వేక్షణ్లో మొదటి ర్యాంకు లక్ష్యంగా భువనగిరి మున్సిపాలిటీ ఫోకస్
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
పక్కా కార్యాచరణతో అధికారులు ముందుకు
ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, సౌత్ జోన్లో 24వ ర్యాంకు సొంతం చేసుకున్న మున్సిపాలిటీ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్కులు కేటాయించనున్న ప్రత్యేక బృందాలు
పరిశుభ్రతకు పట్టం కట్టే స్వచ్ఛత పోటీలో నిలిచేందుకు భువనగిరి మున్సిపాలిటీ సన్నద్ధమవుతున్నది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని స్వచ్ఛత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ముందుకు సాగుతున్నారు. గత నెల 1న మొదలైన స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో సత్తా చాటేందుకు సమయం దగ్గర పడుతుండడంతో మార్కుల పట్టికలో పైకి వెళ్లేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 2018 నుంచి స్వచ్ఛత పోటీలో నిలుస్తూ వస్తున్న భువనగిరి మున్సిపాలిటీ యేటా మెరుగైన ర్యాంకును సొంతం చేసుకుంటూ వస్తున్నది. ఈ క్రమంలో 2021 సంవత్సరంలో లక్ష జనాభాలోపు ఉన్న పట్టణాల్లో సౌత్ జోన్ పరిధిలో 24వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇదే రీతిలో ఈ ఏడాదిలో కూడా టాప్ ర్యాంక్ సాధించేలా పాలకవర్గం, అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 26 : ఆదర్శ పట్టణాల రూపకల్పనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అలాగే స్వచ్ఛత స్థాపన, పరిశుభ్రమైన పట్టణాల రూపకల్పనలో పోటీతత్వాన్ని పెంచేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట ప్రతి యేటా పోటీలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర పురపాలక శాఖ.. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలన్నీ ఉత్తమ ర్యాంకులు సాధించే దిశగా ప్రణాళికను, రోడ్ మ్యాప్ను, టూల్ కిట్ను సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా మంచి ఫలితాలతోపాటు ర్యాంకును సాధించేందుకు భువనగిరి మున్సిపాలిటీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేస్తున్నది. దీనిపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక ఫోకస్ పెట్టగా.. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సైతం అభివృద్ధి పరంగా తోడ్పాటునందిస్తున్నారు.
మెరుగైన ర్యాంకు సాధనకు ఎన్నో అనుకూలతలు..
భువనగిరి మున్సిపాలిటీలో ఇంటింటి నుంచి చెత్త సేకరణ పకడ్బందీగా అమలవుతున్నది. ఇందుకుగాను నిత్యం 204 మంది పారిశుధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. 22 ఆటోలు, ట్రాక్టర్లలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించిన తర్వాత వాటి నుంచి ప్లాస్టిక్, ఇనుప, గాజు ముక్కలు, కాగితాలు, కవర్లను వేరుచేసి ఆదాయం సమీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కంపోస్టుగా మార్చే ప్రక్రియను కూడా నిర్వహిస్తున్నారు. మానవ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ (ఫీకల్ స్లర్జ్ ప్లాంట్) నిర్వహణ ప్రక్రియ సైతం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. సెప్టిక్ ట్యాంకు నిండితే మున్సిపల్ పారిశుధ్య సిబ్బందే వచ్చి తరలింపునకు చర్యలు చేపట్టేందుకు వీలుగా 14420 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రతి వెయ్యి మందికి ఒక పబ్లిక్ టాయ్లెట్ను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. టార్గెట్కు అనుగుణంగా 71 వరకు అందుబాటులోకి తెచ్చారు. ఇండ్ల జియో ట్యాగింగ్ ప్రక్రియ సైతం ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే మున్సిపాలిటీ ఓడీ ప్లస్ ప్లస్ను సాధించడం కూడా అనుకూలాంశం కాగా.. ప్రజల భాగస్వామ్యంతోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్మికులకు సన్మానాలు, స్వచ్ఛతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ప్రజారోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. ఇటీవల రష్యాలోని అతి ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన భువనగిరికి చెందిన పడమటి అన్వితారెడ్డిని మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.
ఇప్పటికే రెండు దశలకు సంబంధించి ప్రాథమిక స్థాయి కార్యక్రమాలు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కీలకమైన మూడో దశ సర్వేను ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో ప్రారంభించి మార్చి వరకు నిర్వహించాక మార్కులు కేటాయిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
మూడు విభాగాల్లో మార్కులు..
గతంలో 6వేల మార్కులు ఉండగా.. ఈసారి 7,500కు పెంచారు. పౌరుల అభిప్రాయం, నిబంధనల మేరకు సర్వీస్ లెవెల్ కార్యక్రమాల అమలు, సర్టిఫికేషన్ అనే మూడు విభాగాల్లో సాధించిన ప్రమాణాలను అనుసరించి 7,500 మార్కులు కేటాయిస్తారు. ప్రధానంగా తడి, పొడి చెత్తను విడిగా సేకరించి.. నిర్వహించడంతోపాటు యంత్రాల నిర్వహణ, డంప్ యార్డులు, మానవ వ్యర్థాల నిర్వహణ, జియో ట్యాగింగ్ తదితర అంశాలతో సాధిస్తున్న ఫలితాలను బట్టి మార్కులు లభించనున్నాయి.
మొదటి ర్యాంకు లక్ష్యంతో పనిచేస్తున్నాం
రాష్ట్ర స్థాయిలో మొదటి, సౌత్ జోన్ పరిధిలో టాప్ టెన్ ర్యాంకుల్లో భువనగిరి మున్సిపాలిటీ ఉండేలా పనిచేస్తున్నాం. ప్రజలకు స్వచ్ఛతపై బాధ్యతను తెలియజేసేలా పెయింటింగ్స్ వేస్తున్నాం. కళా బృందాలతో ప్రదర్శనల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాం. ఇప్పటికే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాం. వీలైనంతలో ప్రతిభ చూపేందుకు అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ వినియోగించుకుంటున్నాం. – పూర్ణచందర్, భువనగిరి మున్సిపల్ కమిషనర్
శుభ్రతపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
మున్సిపాలిటీలో పారిశుధ్యం మెరుగుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నిత్యం తెల్లవారు జామున నాలుగు గంటలకే వీధుల్లో పర్యటించి స్వయంగా పర్యవేక్షిస్తున్నా. మురుగు కాల్వలను శుభ్రం చేయించడంతోపాటు చెత్త తరలింపు ప్రక్రియల్లో ఆటంకాలు లేకుండా చూస్తున్నాం. సమస్య మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నాం. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి సహకారంతో పట్టణంలో సుస్థిరమైన స్వచ్ఛతకు కృషి చేస్తున్నాం. – ఎన్నబోయిన ఆంజనేయులు, భువనగిరి మున్సిపల్ చైర్మన్
ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు..
ప్రాథమిక స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేశాం. ప్రతి కార్యక్రమాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. స్వచ్ఛత కోసం కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను, పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చిన కథనాలను సేకరించి రికార్డుల్లో భద్రపరుస్తున్నాం. గత యేడాది సిరిసిల్ల, సిద్దిపేట, బడంగ్పేట్ మున్సిపాలిటీలతో పోటీపడి నాలుగో స్థానంలో నిలిచాం. ఈ సారి మెరుగైన ర్యాంకును సొంతం చేసుకుంటామన్న నమ్మకం ఉంది. – మహేశ్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్
పాలకవర్గం, అధికారుల కృషి అభినందనీయం
మున్సిపాలిటీలో మౌలిక వసతులకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. రోడ్డు విస్తరణ పనులు కూడా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీని అనేక రంగాల్లో ముందంజలో ఉంచాం. రానున్న రోజుల్లో భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధిపరంగా మరింత ముందంజలో ఉండనుంది. అవార్డుల పరంగా మున్సిపాలిటీని అగ్రభాగాన నిలిపేందుకు అధికారులు, పాలకవర్గం చేస్తున్న కృషి అభినందనీయం. – పైళ్ల శేఖర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే