కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై పోటీకి దిగిన సువేందు అధికారి శుక్రవారం నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, నటుడు మిథున్ చక్రవర్తి సువేందు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
దీదీని 50,000 ఓట్ల తేడాతో ఓడిస్తానని లేనిపక్షంలో రాజకీయాల నుంచి వైదొలగుతానని సువేందు అధికారి సవాల్ విసరడంతో నందిగ్రామ్ పోరు ఉత్కంఠభరితంగా మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 18 ఎంపీ స్ధానాలు గెలుచుకోగా ఇప్పుడు భారీ ఆధిక్యంతో బెంగాల్లో అధికార పగ్గాలు చేపడతామని సువేందు అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక నందిగ్రామ్లో నామినేషన్ వేసే ముందు ఆయన పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పార్టీ శ్రేణులు వెంటరాగా ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసేందుకు తరలివెళతారు.