రాజకీయాల విషయంలో నువ్వు వెనుకంజ వేశావంటే, మూర్ఖుల ఏలుబడిలో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుంది.. జాగ్రత్త!
-ప్లేటో
రాజకీయాల్లో ఏదీ హఠాత్తుగా సంభవించదు. ఒకవేళ అలా జరిగి ఉంటే, అదంతా ఓ ప్రణాళిక ప్రకారమే జరిగి ఉంటుందని కచ్చితంగా చెప్పొచ్చు.
-ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్
.. ఒక్క అడుగుతోనే వేల మైళ్ల ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఒక్క నిర్ణయంతోనే కొత్త చరిత్రకు నాంది పడుతుంది. ఒక్క నాయకుని పిలుపు లక్షలాది మందిని కదిలిస్తుంది.
రాజకీయాల్లోకి ఎందరో పాలకులు వస్తారు. వెళ్తారు. కానీ ఏ కొద్దిమందో తమదైన ముద్ర వేస్తారు. చరిత్ర పుటల్లో తమకంటూ ఓ అధ్యాయాన్ని కేటాయించుకుంటారు. అసలు, వారిని ఇతరులకు భిన్నంగా తీర్చిదిద్దిన అంశాలు ఏమిటి? ప్రజల మనసులకు అంత దగ్గర చేసిన అయస్కాంతత్వ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిర్భీతి.. నమ్ముకున్న సిద్ధాంతం పట్ల మడమతిప్పని విశ్వాసం. తెగింపు.. అవరోధాలు ఎదురైనా ముందుకెళ్లగల తెగువ. ధైర్యం.. అణచివేతలను లెక్కచేయని గుండెధైర్యం. వ్యూహం.. ఉద్యమాన్ని బతికించుకునే బలమైన ఆలోచనా విధానం. ఓర్పు.. లక్ష్యాన్ని చేరుకునేవరకూ సడలని పట్టుదల. ఈ సుగుణాలే ఎంతోమంది నేతలను జనప్రియులను చేశాయి. రాజకీయ ముఖచిత్రాన్ని, దేశ భవిష్యత్తును తిరగరాయగల దమ్మూ ధైర్యం ప్రసాదించాయి. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న అలాంటి మార్పు కెరటాల గెలుపు కథనాలు..
20వ శతాబ్దపు పాలకుల్లో అత్యంత ప్రభావశీలి.. లీ క్యాన్ యు. సింగపూర్ను అతి తక్కువ సమయంలోనే అత్యంత సంపన్న దేశంగా తీర్చిదిద్దిన దార్శనికుడాయన. లీ క్యాన్ యు.. 1959లో తన 35వ ఏట అధికారం చేపట్టారు. 87 ఏండ్లు వచ్చేవరకూ.. అంటే మూడు దశాబ్దాల పాటు పాలించారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో ప్రస్తావించిన అనేక అంశాలు లీ పాలనలో అంతర్భాగమని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తారు. సింగపూర్లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత లండన్ స్కూలు ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో చేరారు లీ. అంతకు ముందు కేంబ్రిడ్జ్ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. ఆ తర్వాత సింగపూర్ తిరిగొచ్చి పోస్టల్ యూనియన్ న్యాయసలహాదారుగా నియమితులయ్యారు. తనదైన పోరాటంతో పోస్టల్ ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల సాధించారు. ఇతర ట్రేడ్ యూనియన్లతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. 1954లో పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ)ని స్థాపించారు. మొదట కమ్యూనిస్టులను కూడా చేర్చుకున్నా, తర్వాత వారితో తెగతెంపులు చేసుకున్నారు. సింగపూర్ను బలమైన పారిశ్రామిక శక్తిగా తీర్చిదిద్దడంలో, ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతిదారుగా మార్చటంలో కీలక పాత్ర పోషించారు. అక్కడితో ఆగలేదు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించారు. లేబర్ యూనియన్లకు, యజమానులకు మధ్య సంప్రదింపుల్లో కీలకంగా ఉంటూ.. అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచటానికి తోడ్పడ్డారు. సింగపూర్కు భూ వసతి తక్కువ. సహజ వనరులూ అంతగా లేవు. ఆ పరిమితులు తెలిసినవారు కాబట్టే.. తక్కువ పన్నులు, నామమాత్రపు నిబంధనలతో స్వేచ్ఛాయుత వలస విధానాలు అమలుచేశారు. ఆసియా దేశాలకు సింగపూర్ను రోల్ మోడల్గా నిలబెట్టారు. ఆ దేశ తలసరి ఆదాయాన్ని ఆస్ట్రేలియాకు రెట్టింపు చేశారు.
మారిన పంథా
తొలుత సోషలిజం, పంచవర్ష ప్రణాళిక నినాదాన్ని ఎత్తుకున్నా తర్వాతి రోజుల్లో లీ తన పంథా మార్చుకున్నారు. పాలనలో నిజాయతీ, జవాబుదారీతనంపై దృష్టిపెట్టారు. వ్యవస్థలోని లోపాలను కడిగిపారేశారు. అవినీతిపరులను తొలగించటానికి ఏ మాత్రం వెనుకాడలేదు. మంచి పనితీరు కనబరిచిన రాజకీయ నాయకులను, అధికారులను గౌరవించే సంస్కృతిని ప్రవేశపెట్టారు. సిబ్బందికి ఆకర్షణీయమైన వేతనాలు ఇస్తే ప్రలోభాలకు లొంగరని భావించారు. వయసుకు, చేపట్టే బాధ్యతకు సంబంధం లేదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. దీంతో పనిమంతుల ప్రతిభకు ఘనమైన ప్రతిఫలం లభించేది. అదే సమయంలో ఫలితాల్లో వెనుకబడితే నిర్మొహమాటంగా పక్కకు పెట్టేవారు. అక్కడ, సింగపూర్ ఎయిర్ లైన్స్ను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. కానీ అందులో పాలకుల జోక్యం లేకుండా తెమాసెక్ అనే ఆస్తుల నిర్వహణ సంస్థ (అసెట్ మేనేజ్మెంటు కంపెనీ) ఏర్పాటు చేశారు. ఇందులో సింగపూర్లోని ప్రైవేటురంగ నిపుణులు భాగస్వాములుగా ఉంటారు. వారు స్వతంత్రంగా పనిచేస్తారు. లాభాలు గడించటం, అత్యుత్తమమైన ప్రమాణాలను ప్రదర్శించటం వారి బాధ్యత. కాబట్టే సింగపూర్ ఎయిర్ పోర్ట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేస్తుంది. నిక్కచ్చిగా మాట్లాడే నాయకునిగా లీకి పేరుంది.
‘సామాజిక అశాంతి అత్యంత ప్రమాదకరం. స్థానికంగా అసమ్మతి ప్రబలితే అది ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది. అందుకే సామాజిక న్యాయం కోసం అందరూ ప్రయత్నించాలి’ అంటారు గేబ్రియాల్ బోరిక్. లాటిన్ అమెరికా వామపక్ష రాజకీయాల్లో కొత్త ముఖం ఆ యువకుడు. ముప్పై ఆరేండ్ల బోరిక్ 11 మార్చి 2022న చిలీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థి ఉద్యమాలతో బోరిక్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. యూనివర్సిటీ ఆఫ్ చిలీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇదే కాలంలో చిలీ స్టూడెంట్స్ ఫెడరేషన్కు అధ్యక్షునిగా వ్యవహరించారు. 2011-13 మధ్య చిలీయన్ విద్యార్థి ఆందోళనల్లో కీలక పాత్ర పోషించారు. చిలీలో గత ఏడాది వరకూ అశాంతి, ఆందోళనలు కొనసాగాయి. అధిక ధరలు, ప్రైవేటీకరణ, సామాజిక అసమానతలు ప్రజలను అసహనానికి గురి చేశాయి. విద్య, ఆరోగ్య సంరక్షణ, పెన్షన్ సంస్కరణలు చేపట్టాలని, మెరుగైన వేతనాలు అందించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని ఆందోళనలు సాగాయి. అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు పెచ్చరిల్లాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చర్చల్లో విద్యార్థి నేతగా బోరిక్ భాగస్వామి అయ్యారు. అదే వేదిక రాజ్యాంగ మార్పునకు రెఫరెండంగా మారింది. అయితే చిత్రంగా బోరిక్ అధ్యక్షుడైన తర్వాత ప్రతిపాదించిన ఇదే రాజ్యాంగాన్ని ఎక్కువ మంది ఓటర్లు తిరస్కరించారు. ఈ పరిణామంపై తనెప్పుడూ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. ‘ఈ సవాళ్లను రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటా. పునరేకీకరణ ప్రపంచంలో భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు సహజమే’ అంటూ ఆ పరిస్థితిని సమర్థించుకున్నారు. దేశం గర్వపడే రాజ్యాంగం త్వరలోనే రూపుదిద్దుకుంటుందని మాటిచ్చారు. చాంబర్ ఆఫ్ డిప్యూటీస్కు బోరిక్ రెండుసార్లు ఎన్నికయ్యారు. 2013న ఇండిపెండెంట్గా ఒకసారి, 2017లో ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన వామపక్ష కూటమి బ్రాడ్ ఫ్రంట్ తరఫున మరోసారి విజయం సాధించారు. 2018లో ఏర్పాటు చేసిన సోషల్ కన్వర్జేషన్లో తను వ్యవస్థాపక సభ్యుడు కూడా. 2021లో బ్రాడ్ ఫ్రంట్తోపాటు కమ్యూనిస్ట్ పార్టీ, ఇతర చిన్నాచితకా పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. 60 శాతం పాపులర్ ఓటుతో ప్రైమరీల్లో విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నిక రెండో రౌండ్లో జోస్ యాంటోనియన్ను 55.9శాతం ఓట్లతో ఓడించారు.
వందేండ్ల బ్రిటిష్ లేబర్ పార్టీ చరిత్రలో వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించిన అరుదైన ఘనత బ్లెయర్ సొంతం. అతి పిన్నవయసులో బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో యూకే ఆర్థికవ్యవస్థ అభివృద్ధిలో రికార్డులు సృష్టించింది. ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ, విద్య తదితర రంగాల్లో వినూత్నమైన మార్పులు తెచ్చింది. మొట్టమొదటిసారిగా కనీస వేతన చట్టం అమలు చేశారు. 2012 ఒలింపిక్స్ బిడ్ను గెలిచి పోటీలను విజయవంతంగా నిర్వహించారు. ఉత్తర ఐర్లాండ్ శాంతి ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేశారు. కొసావో, సిరియా, లియోన్, ఆప్ఘనిస్తాన్, ఇరాక్లలో పరిస్థితులపై ప్రపంచ దేశాలు మాట్లాడాలని భావించేవారు. ఆఫ్రికాకు బ్రిటన్ సాయాన్ని బ్లెయిర్ వ్యతిరేకించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి మొట్టమొదటి పర్యావరణ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రధాని బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత ప్రధానంగా మూడు అంశాలపైన దృష్టిపెట్టారు.. ఒకటి, మధ్యప్రాచ్యంలో శాంతి సాధన. రెండు, ప్రభుత్వాలు ప్రభావవంతంగా పనిచేయటానికి సహకరించటం. మూడు, తీవ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవటం. ఇందుకోసం ‘టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్’ అన్న సంస్థను నెలకొల్పారు. ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు.. రాజకీయాల ద్వారా ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నది ఆ వేదిక.
‘ఇప్పటి తరానికి శాంతి అనేది కొత్తగా అర్థం అవుతున్నది. భౌతిక, మానసిక బీభత్సాలకు తోడు సైనిక ఆక్రమణలు, విదేశీ ఆధిపత్యం వారికి గొప్ప సత్యాన్ని ఎరుకపరుస్తున్నాయి. స్వేచ్ఛ, జీవితం రెండూ ఒకటే. ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నప్పుడు, స్వేచ్ఛగా శ్వాసిస్తున్నప్పుడు, తాము కోరుకున్నది చేయగలిగినప్పుడు.. శాంతికి బీజాలు పడతాయి’ అంటూ నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సందర్భంగా తన మనోభావాన్ని వ్యక్తం చేశారు లెచ్ ఉలెసా. కార్మికుల హక్కుల సాధనకు లెచ్ ప్రారంభించిన సంఘీభావ ఉద్యమం (సాలిడారిటీ మూమెంట్) పోలెండ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. ప్రజాస్వామ్య ఆందోళనలు ఊపందుకొన్నాయి. చివరికి 1989లో పోలెండ్లో కమ్యూనిస్టు పాలనకు తెరపడింది. కోల్డ్వార్ కూడా ముగిసింది.1990 నుంచి 1995 వరకూ ఆయన పోలెండు అధ్యక్షునిగా పని చేశారు. మార్క్సిస్టు లెనినిస్టు సోషలిజం నుంచి స్వేచ్ఛవాణిజ్య పెట్టుబడిదారీ ఉదార ప్రజాస్వామ్యం వైపు దేశాన్ని నడిపారు. 1926 తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలినేత ఇతనే. పాపులర్ ఓటు ద్వారా ఎన్నికైన అధ్యక్షుడు కూడా ఆయనే కావటం విశేషం.
సామాన్యుడిగా..
షిప్ యార్డులో ఎలక్ట్రిషీయన్గా లెచ్ జీవితం మొదలైంది. ఆ సమయంలో అక్కడి ఉద్యోగుల హక్కుల కోసం పోరాడారు. మొదట్లో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలనే ఆలోచన ఏమాత్రం ఉండేది కాదు తనకి. మానవ హక్కుల సాధనకు మద్దతు పలకడంతో రాజకీయ వ్యవస్థపై కాలుదువ్వడం తప్పనిసరైంది. పౌర ప్రతిఘటనను ఆయుధంగా చేసుకుని సామాజిక మార్పుకు ప్రయత్నించారు. ఫలితంగా ఎన్నో నిర్బంధాలకు గురయ్యారు. అనేకసార్లు అరెస్టయ్యారు. ఉద్యోగాన్ని కూడా కోల్పోయారు. అనేకానేక ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డారు. ప్రభుత్వంతో చర్చలో ్ల భాగసామ్యం వహించారు. ఇదే సమయంలో ‘సాలిడారిటీ’ ఆవిర్భవించింది. స్వతంత్రంగా పనిచేసే 20 ట్రేడ్ యూనియన్లు కలిసిపోయి ఒక సంస్థగా రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ కూడా ఇదే. ఒక దశలో, ఇందులో సభ్యుల సంఖ్య కోటికి చేరింది. ఈ సంఘాన్ని అణచివేయటానికి ప్రభుత్వం ‘మార్షల్ లా’ విధించింది. అమెరికా నిధులతో అనేక కుతంత్రాలు చేసింది. ఇవేమీ ఆ ప్రజా ఉద్యమాన్ని నిలువరించలేక పోయాయి. ఆ తర్వాత, 1995లో మరోమారు అధ్యక్షునిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దాంతో ఆయన ప్రభావం పోలండ్పై సన్నగిల్లింది. ఆ తర్వాత లెచ్ ఉలెసా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ (1981), టైమ్స్ అత్యంత ప్రభావశీల వ్యక్తి (1999) అవార్డు దక్కించుకున్నారు.
ఇటీవలి కాలంలో జెలెన్ స్కీ అంతగా వార్తలో నలుగుతున్న వ్యక్తి మరొకరు కనిపించరు. తమ దేశాన్ని హస్తగతం చేసుకోవటానికి రష్యన్లు చేస్తున్న ప్రయత్నాలను లౌక్యంగా తిప్పికొడుతూ, మొక్కవోని ధీరత్వాన్ని ప్రదర్శించారు. ఆ నాయకత్వ ప్రతిభకు అంతర్జాతీయ ప్రశంసలూ దక్కాయి. ప్రపంచదేశాల అధినేతల నైతిక మద్దతును, అగ్రరాజ్యం అమెరికా ఆదరణను చూరగొన్నారు. నటుడు, కమెడియన్ అయిన జెలెన్ స్కీ 2019లో ఉక్రెయిన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అవినీతి వ్యతిరేక ఉద్యమ వేదిక ద్వారా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా లభించిన మద్దతు ఓట్లకు పునాదిగా మారింది. దీంతో ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేయగలిగారు. జెలెన్ స్కీ యూదు కుటుంబంలో పుట్టారు. దక్షిణ ఉక్రెయిన్లో జన్మించినా, చిన్నప్పుడే మంగోలియా వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ నాలుగేండ్లకు ఉక్రెయిన్ తిరిగివచ్చి స్కూల్లో చేరారు. అందరిలానే స్థానికంగా రష్యన్ భాష మాట్లాడేవారు. ఉక్రేనియన్, ఇంగ్లిష్లలో ప్రావీణ్యం సంపాదించారు. లా డిగ్రీ సంపాదించారు. కానీ ఆది నుంచీ థియేటర్ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. అతని బృందం ‘క్వార్తల్ 95’గా స్థానికంగా ప్రాచుర్యం పొందింది. టీవీ రంగంలోనూ సెలెబ్రిటీ అయ్యారు. ఉక్రేనియన్ టీవీ చానల్ ఇంటర్ టీవీకి ప్రొడ్యూసర్గా మారారు.
యుద్ధ వ్యూహకర్త
రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించటానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా తన మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైనట్టు ప్రకటించింది. నేటికీ యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. తొలుత బలహీనంగా కనిపించినా, రష్యా ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను చేజిక్కించుకోవటంలో ఉక్రెయిన్ ఎంతోకొంత విజయం సాధిస్తూనే ఉన్నది. ఉక్రేనియన్ ప్రతిఘటనకు జెలెన్ స్కీ ముఖచిత్రంగా మారారు. వినోదరంగ నేపథ్యం, మీడియా ఆకర్షణ అతనికి ఆయుధంగా మారాయి. అలాంటి వ్యక్తిని ఎదుర్కోవటం పుతిన్కు సాధ్యం కాలేదు. రాజధాని నుంచి అతను పారిపోయాడని రష్యా దుష్ప్రచారం చేసినప్పుడు, ధైర్యంగా వీధులెకెక్కారు. సెంట్రల్ కివీ మధ్యలో నిలబడి వీడియో తీయించుకున్నారు. పోరాట ప్రాంతం నుంచి ఖాళీ చేయమని అమెరికా ప్రతిపాదించినప్పుడు,
‘ఇక్కడ జరుగుతున్నది సవారీ కాదు. యుద్ధం. నాకు మందుగుండు కావాలి’ అని కోరారు. అంతేకాదు, సాయం పొందటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ అనుసరించారు. రష్యన్ల దురాగతాలను నిలువరించటానికి తనకు సైనిక సంపత్తి కావాలని బహిరంగంగా కోరారు. జెలెన్ స్కీ వినతులు చాలా వరకూ ఫలితమిచ్చాయి. పడమటి దేశాలు యుద్ధ ట్యాంకులు, క్షిపణులు అందించి మద్దతు పలికాయి. ఇదంతా ఒక ఎత్తయితే, రష్యాపై ప్రపంచ దేశాలు ఝళిపించిన ఆంక్షలు ఆ మాజీ అగ్రదేశ ఆర్థిక మూలాలను దెబ్బతీశాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలూ అందవని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. ఆ ఆంక్షల కారణంగా పడమటి దేశాల నుంచి నిధులు సమీకరించే హక్కు రష్యాకు ఉండదు. అమెరికా, ఐరోపా మార్కెట్లలో వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడమూ వీలు కాదు. చివరికి యుద్ధం ఎటు దారితీసినా, ఇప్పటి వరకూ జెలెన్ స్కీ సాధించింది మాత్రం అసాధారణమైన విజయమే.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా, రెండోఅత్యంత శక్తిమవంతమైన ఆర్థిక వ్యవస్థ చైనా సొంతం. జిన్ పింగ్ 2013 నుంచీ ఆ దేశానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. ఎవరైనా సరే చైనా రాజ్యాంగం నిర్దేశించిన ‘రూల్ ఆఫ్ లా’కు కట్టుబడాల్సిందేనని త్రికరణశుద్ధిగా నమ్ముతారు జిన్ పింగ్. సోషలిజంతోనే ప్రగతి సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. ఆయన హయాంలో అంతర్జాతీయ వ్యవహారాల్లో మునుపెన్నడూలేనంత దృఢంగా వ్యవహరిస్తున్నది చైనా. మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడే తన అధికారాన్ని సుస్థిరం చేసుకునే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. 2017 చివరి నాటికి దాదాపు పదిలక్షల మంది అవినీతి ఉద్యోగులకు శిక్షలు విధించారు. ఇదే కారణం చూపించి తన రాజకీయ ప్రత్యర్థులందరినీ చిత్తుచేసి తన శక్తిని పెంచుకున్నారు. జిన్ పింగ్ గతం కూడా స్ఫూర్తిదాయకమే. ఆ దేశ డిప్యూటీ ప్రధానిగా వ్యవహరించిన జోంక్సన్ కుమారుడు తను. కెమికల్ ఇంజినీరింగ్ చదివారు. 1994లో అధికారికంగా కమ్యూనిస్టు పార్టీలోకి ప్రవేశించారు. ఫ్యూజియాన్కు గవర్నర్గా వ్యవహరించారు. డిప్యూటీ సెకటరీగా బాధ్యతలు చేపట్టారు. షాంఘైలో అగ్రనాయకత్వంపై ఆరోపణలు రావటంతో సిటీపార్టీ సెక్రెటరీ బాధ్యతల్లోకి మారారు. ఆ పదవిలో కొద్దికాలం మాత్రమే కొనసాగినా.. తొమ్మిది మంది స్టాండింగ్ కమిటీ సభ్యులలో ఒకరయ్యారు. మార్చి 2008లో చైనా ఉపాధ్యక్షుడయ్యారు. 2010లో శక్తిమంతమైన సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.
సరికొత్త అధ్యాయం
2021 నవంబర్లో జిన్ పింగ్ అధికారాన్ని బలపరిచే పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ గత వందేండ్ల విజయాలను, అనుభవాలను పున: సమీక్షించుకుని భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తూ ఒక చారిత్రక తీర్మానం చేసింది. ఈ పత్రంలో సగానికిపైగా చోటును తొమ్మిదేండ్ల కాలంలో జింగ్ సాధించిన విజయాలను చెప్పటానికే కేటాయించింది. పేదరిక నిర్మూలన, అవినీతిని తరిమికొట్టడం వంటి అంశాలను పేర్కొంది. పార్టీ చరిత్రలో ఇలాంటి ప్రతిపాదన ముందుంచడం ఇది మూడోసారి. అంతకు ముందు మావో, డెంగ్ హయాంలో ఇలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇది జిన్ పింగ్ స్థాయిని పెంచింది. అక్టోబరు 2016లో కమ్యూనిస్టు పార్టీ ‘కోర్ లీడర్’ అన్న బిరుదును ప్రసాదించింది. అంతకు ముందు మావో జిడాంగ్, డెంగ్ జియాపింగ్, జియాన్ జెమింగ్లకు మాతమే ఈ గౌరవం లభించింది. ఏడాది తర్వాత ‘పార్టీ రాజ్యాంగంలో జిన్ పింగ్ భావజాలం’ పేరుతో ఆయన సిద్ధాంతాలకు చోటు కల్పించింది. మావోకు మాతమే ఆ స్థాయి గౌరవం దక్కింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) పార్టీ ఇందుకోసం సవరణ చేపట్టింది. దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పదవీకాలానికి పరిమితిని తొలగించింది. దీంతో పదవీకాలం 2023 నాటికి పూర్తయినా ఆయన మాత్రం అధికారంలో కొనసాగుతారు. మార్చి 2018లో ఎన్పీసీ రెండోసారి కూడా అధ్యక్షునిగా ఎన్నుకుంది. మంచిచెడులు పక్కనపెడితే, భారత్తో సంబంధాలను మినహాయిస్తే.. ఆయనో తిరుగులేని నేత.
‘యూరప్ నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. అతితక్కువ జననాల రేటు’ అంటారు మహిళా నేత జార్జియా మెలోనీ. ఇటలీ చరిత్రలోనే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారామె. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అక్కడ ఏర్పాటవుతున్న తొలి అతివాద ప్రభుత్వమూ ఇదే. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు మాజీ అధ్యక్షుడు మారియో డ్రాఘీ నుంచి ఆమె అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. మారియో తన పద్దెనిమిది నెలల పదవీకాలంలో రోమ్ను యూరోపియన్ యూనియన్ పాలసీ విధానంలోకి నెట్టేసారు. అలా పారిస్, బెర్లిన్లతో సంబంధాలు దెబ్బతినటానికి కారణమయ్యారు. గత ఎన్నికల్లో మెలోనీ పార్టీకి 4 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో మారియా నేతృత్వంలోని కూటమిలో చేరటానికి నిరాకరించి ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఈ దఫా ఆమె కూటమి 43 శాతం ఓట్లతో విజయం సాధించింది. మెలోనీది శాపగ్రస్థ బాల్యం. తండ్రి బాధ్యతలేని మనిషి. తల్లి పెంపకంలోనే పెరిగింది. చదువు పూర్తయ్యాక కొంతకాలం జర్నలిస్టుగా పనిచేసింది. 15 ఏండ్ల వయసులో నియో ఫాసిస్ట్ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (ఎమ్ఎస్ఐ)లో చేరింది. 1990 నాటికి అది నేషనల్ అలయెన్స్ (ఎఎన్)లో భాగస్వామ్యమైంది. ఆ తర్వాత మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ నేతృత్వంలోని కన్జర్వేటివ్ గ్రూప్లో విలీనమైంది.
తొలి అడుగు..
21 ఏండ్ల వయసులో స్థానిక ఎన్నికల్లో విజయం ద్వారా మెలోనీ రాజకీయప్రవేశం చేసింది. 2008- 2011 మధ్య బులస్కనీ ప్రభుత్వంలో యువజనశాఖ మంత్రిగా పనిచేసింది. అప్పట్లో మంత్రి పదవి చేపట్టిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డు సాధించింది కూడా. 2012లో ఆ పార్టీని వదిలిపెట్టిన మెలోనీ, క్రొస్సెట్టోలతో కలిసి జాతీయగీతం ఆరంభ వాక్యాలతో ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించింది. రైటర్స్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. తమ పార్టీని యూఎస్ రిపబ్లికన్ పార్టీ, బ్రిటన్ కన్జర్వేషన్ పార్టీతో పోల్చుకుంది. దేశభక్తికి, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తామని పేర్కొంది. అద్దె గర్భం (సరోగసీ) అనేది స్త్రీ స్థాయిని దిగజారుస్తుందని వ్యాఖ్యానించింది. ఇలా అన్నందుకు స్త్రీ వ్యతిరేకిగా ఆమెపై ముద్రపడింది. నిరసనలు వ్యక్తమయ్యాయి. యూట్యూబ్ ఆమె ప్రసంగాన్ని తొలగించింది. కానీ మెలోనీ తన వాదనకే కట్టుబడ్డారు. తాను నిండు గర్భిణిగా రోమ్ మేయర్ పదవికి పోటీ పడిన విషయాన్ని ప్రస్తావించారు.
ఎలన్ మస్క్ బాల్యం ఎంత దారుణంగా గడిచింది.. ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాడో తెలుసా