FedEx CEO | ఆర్యభట్ట నుంచి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వరకు ప్రపంచ చరిత్రలోనే ఎంతో మంది మేధావులకు భారత్ పుట్టినిల్లు. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ వంటి లక్ష్మీ పుత్రులకు నిలయం. మేధో సంపత్తితోపాటు వ్యాపార లావాదేవీల్లో నైపుణ్యాన్ని పుణికిపుచ్చుకుని భారత్ గర్వించేలా అంతర్జాతీయంగా వివిధ రంగాల వ్యాపార, ఐటీ సర్వీసెస్ సంస్థలకు భారతీయులు సారధ్యం వహిస్తున్నారు. గ్లోబల్ ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల.. గూగుల్ సుందర్ పిచ్చాయ్.. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ .. తాజాగా అంతర్జాతీయ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడెక్స్ సీఈవోగా రాజ్ సుబ్రమణ్యమ్ ఆ జాబితాలో చేరారు. వీరంతా ఇండియన్స్ నైపుణ్యానికి మచ్చు తునక వంటి వారు.. వీరితోపాటు పలు సంస్థలకు సీఈవోలుగా సారధ్యం వహిస్తున్న భారత సంతతి వారి గురించి ఓ లుకేద్దాం..
కాన్పూర్ ఐఐటీ విద్యార్థి అరవింద్ కృష్ణ.. రెండు దశాబ్దాలకు పైగా ఐటీ సంస్థ ఐబీఎంకు సీఈవోగా సారధ్యం వహించారు. ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేసిన అరవింద్ కృష్ణ తెలివితేటకు ఐబీఎంలో సరైన గుర్తింపు లభించింది.
తమిళనాడుకు చెందిన పిచ్చాయ్ సుందరరాజన్ అలియాస్ సుందర్ పిచ్చాయ్ 2004లో గూగుల్లో ఎగ్జిక్యూటివ్గా కెరీర్ ప్రారంభించిన ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్. తొలుత బిజినెస్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా చేరినా.. ల్యారీ పేజ్, సెర్జెయ్ బ్రిన్ స్థానంలో ప్రస్తుతం గూగుల్ & ఆల్ఫాబెట్ సీఈవోగా సేవలందిస్తున్నారు. మదురైలో జన్మించిన సుందర్ పిచ్చాయ్.. ఖరగ్పూర్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. అటుపై కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యాభ్యాసం చేసిన సత్య నాదెళ్ల.. 2014 ఫిబ్రవరి నుంచి గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా పని చేస్తున్నారు. గురువారం ఆయనను మైక్రోసాఫ్ట్.. సంస్థ చైర్మన్గా నియమించింది. కర్ణాటకలో బీటెక్ పూర్తి చేసిన సత్యనాదెళ్ల.. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సెస్లో ఎంఎస్ చదివారు. తెలుగు తేజం సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్లో చేరడానికి ముందు సన్ మైక్రో సిస్టమ్స్లో పని చేశారు.
హైదరాబాద్లో జన్మించిన శంతను నారాయణ్.. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసుకుని.. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్నారు. కష్టించి పని చేసే స్వభావానికి మారుపేరుగా నిలిచిన శంతను.. తొలుత ఆపిల్లో పని చేశారు. అటుపై అడోబ్ సంస్థలో చేరారు. 2007 నుంచి అడోబ్ ఇంక్కు సీఈవో కం చైర్మన్గా సేవలందిస్తున్నారు.
రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హర్బజన్ సింగ్ తనయుడిగా అజయ్ పాల్ బంగా 1990 నుంచి ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మాస్టర్ కార్డ్లో పని చేస్తున్నారు. 2010 ఏప్రిల్లో సంస్థ సీఈవోగా నియమితులయ్యారు. తర్వాత చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన అజయ్ బంగా.. ప్రస్తుతం ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ఆయన అహ్మదాబాద్ ఐఐఎం పాత విద్యార్థి.
లండన్లో పుట్టి న్యూఢిల్లీలో పెరిగిన అమెరికన్ బిలియనీర్ ఉమన్ జయశ్రీ ఉల్లాల్… 2008 నుంచి ఆరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా సేవలందిస్తున్నారు. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. అటుపై శాంతా క్లారా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేశారు.
భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి.. గత ఫిబ్రవరిలో ఇమ్మార్సాత్ సీఈవోగా నియమితులయ్యారు. సింగపూర్కు చెందిన ఈ బిజినెస్మెన్ 2020 జూలై 31 వరకు నోకియా ఇంక్ సీఈవోగా పని చేశారు.న్యూఢిల్లీలో పుట్టినా పెరిగింది కువైట్లో. 2014లో నోకియా ఇంక్ సీఈవోగా నియమితులయ్యారు. కర్ణాటకలోని మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నతవిద్యనభ్యసించారు.
ఒరాకిల్, అకామాయి టెక్నాలజీస్ వంటి సంస్థల్లో విభిన్న విధులు నిర్వర్తించిన జార్జి కురియన్ 2015 జూన్ నుంచి నెట్ యాప్ సంస్థ చైర్మన్ అండ్ సీఈవోగా సేవలందిస్తున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన కురియన్.. మద్రాస్ ఐఐటీలో ఇంజినీరింగ్ డిగ్రీ చేశారు. అటుపై ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు.
ఇండియన్ అమెరికన్ బిజినెస్ మెన్ ఫ్రాన్సిస్కో డిసౌజా.. అమెరికాలోని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్కు మాజీ సీఈవో. 2018లో వైస్ చైర్మన్గా నియమితులయ్యారు. 2019 ఏప్రిల్ ఒకటో తేదీ వరకు సీఈవోగా పని చేశారు.