నేరేడుచర్ల, మార్చి 18: గ్రామాల్లో వలసల నివారణకు తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకానికి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. ఎండా కాలంలో 38 నుంచి 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరు కారు. అయితే మార్చి నుంచి జూన్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే నేపథ్యంలో కూలీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 20 నుంచి 30శాతం అదనపు భత్యం చెల్లించేది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కొనసాగిన టీసీఎస్ సాఫ్ట్వేర్లో ఉన్న ఆప్షన్ను కేంద్రం కొత్తగా తెచ్చిన ఎన్ఐసీ సాఫ్ట్వేర్లో తొలగించింది. కొత్త సాఫ్ట్వేర్లో అదనపు భత్యం ఊసే లేకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కూలీల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త సాఫ్ట్వేర్లో సైతం గతంలో ఉన్న విధంగానే వేసవి భత్యాలకు సంబంధించిన ఆప్షన్ను ఉంచాలని కూలీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఎత్తులు వేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎన్నో యేండ్లుగా వేసవి కాలంలో అదనపు భత్యం చెల్లిస్తుండగా కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్లో అదనపు భత్యం ఆప్షన్ లేకుండా చేసింది. దాంతో కూలీల సంఖ్య మరింత తగ్గే ప్రమాదం ఉంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కూలీల సంఖ్య మరింత తగ్గుతుందని పలువురు విమర్శిస్తున్నారు. రోజు రోజుకూ ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనులకు రావడానికి కూలీలు వెనుకడుగు వేస్తున్నారు. శ్రమకు తగ్గ ఫలితం ఉండటం లేదని, కేంద్రం తమ నిర్ణయం మార్చుకోవాలని పలువురు కోరుతున్నారు. వేసవిలో కూలి ఎక్కువ వచ్చేది ఎండాకాలంలో కూలి ఎక్కువ వస్తుందనే ఆశతో మండుటెండను సైతం లెక్క చేయకుండా పనులకు వచ్చే వాళ్లం . ఇతర రోజుల్లో చేసిన కూలి కంటే ఈ వేసవిలో నాలుగు నెలలు ఎక్కువ మొత్తం గిట్టుబాటు అయ్యేది. ఈసారి కూడా వేసవి భత్యం చెల్లించాలి
– నకిరేకంటి రాజేశ్, మేడారం, నేరేడుచర్ల మండలం
ఉపాధి హామీ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ను తొలగించి కేంద్ర ప్రభుత్వం కొత్త సాప్ట్వేర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కార్యకలాపాలు చేపడుతున్నాం. ఇందులో వేసవి భత్యం ఆప్షన్ లేదు. ప్రభుత్వం నుంచి పూర్తి ఆదేశాలు రావాల్సి ఉంది.
– సుందరి కిరణ్కుమార్, డీఆర్డీఓ, సూర్యాపేట