మన దేశంలో రోజురోజుకు డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రపంచంలోనే ఇండియాను ‘మధుమేహ రాజధాని’గా పిలుస్తున్నారు. దీనంతటికీ షుగర్ మాఫియాగా పేరున్న పలు మందుల కంపెనీలు కారణమవుతున్నాయి. సంప్రదాయంగా తీపిని శుభకార్యాల్లో వినియోగించటం మనకుఅలవాటు. ఆ నమ్మకాన్నే వాడుకుంటూ పలు కంపెనీలు మరింత అధికంగా చక్కెర వినియోగించేలా ప్రోత్సహిస్తున్నాయి. దీంతో భారతీయుల ఆరోగ్యం దెబ్బతింటున్నది.
మన దేశంలో మధుమేహం వల్ల సంభవిస్తున్న మరణాలు ఏటా పెరుగుతున్నా యి. 1990లో 1.15 లక్షల మంది మరణించగా, 2000లో 1.86 లక్షల మంది, 2010లో 2.81 లక్షల మంది, 2015లో 3.46 లక్షల మంది మరణించారు. మధుమేహానికి కారణం శ్రమకు దూర మైన ఆధునిక జీవనం, కాలుష్య పరిసరాలు. దీనికి తోడు ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు ప్రకారం ఒక వ్యక్తి చక్కెర వినియోగం రోజుకు 25 గ్రాములకు మించొద్దు. భారత్లో ఇది 50 గ్రాముల కన్నా ఎక్కువే ఉంటున్నది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
17వ శతాబ్దంలో యురోపియన్లు దాదాపు ప్రపంచమంతటినీ శాసించారు. వారు తీపి కోసం తేనెపై ఆధారపడేవారు. తేనె ఉత్పత్తి పరిమితంగా ఉండటంతో వారి దృష్టి చెరకుపై పడింది. కరేబియన్ దీవుల్లో చెరకు ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉందని గుర్తించారు. ఆయా దేశాల్లో శ్రామికుల కొరత తీవ్రంగా ఉండటంతో ఆఫ్రికా నుంచి మనుష్యులను అపహరించి, బానిసలుగా మార్చి ఇక్కడ పని చేయించడం మొదలుపెట్టారు. బ్రిటీషర్లు సైతం పేద భారతీయులను తమ వలస భూభాగాల్లోని చెరకు తోటల్లో పని చేయించడానికి బలవంతంగా పంపించారు.
మన దేశంలో తీపి కోసం సంప్రదాయకంగా బెల్లం వినియోగించేవారు. 19వ శతాబ్దంలో బ్రిటీషర్లు పెద్ద ఎత్తున చక్కెర ఉత్పత్తి పరిశ్రమలు పెట్టారు. అప్పటినుంచి దేశంలో చక్కెర వినియోగం పెరిగింది. 1930-35 మధ్యన చక్కెర ఉత్పత్తి 460 శాతం పెరిగింది. 1954లో ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చి చక్కెర పరిశ్రమలను మరింత ప్రోత్సహించింది. దీనివల్ల నేడు ప్రపంచంలోనే అత్యధికంగా పంచదార ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో బ్రెజిల్ తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది.
చక్కెరతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దాంట్లో ‘ఎంప్టీ క్యాలరీస్’ ఉంటాయి. అంటే చక్కెర మనకు పోషకాల్లేని శక్తినే ఇస్తుంది. దీంతో పోల్చుకుంటే బెల్లంలో కొన్నిరకాల పోషకాలుంటాయి. చక్కెర వల్ల శరీరంలో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. దీనివల్ల ఆనందం కలుగుతున్న భావన ఏర్పడుతుంది. మరింత తీపి తినాలనే కోరిక పెరు గుతుంది. మధుమేహం ఉన్నవారికి చక్కె ర మరింత ప్రమాదం. మధుమేహంతో మరెన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. కూల్డ్రింక్స్ తరచూ తాగి తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం 25 శాతం ఎక్కువ.
చక్కెరను ఉత్పత్తి చేసే చెరకు పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ. ఒక హెక్టారులో (దాదాపు 2.5 ఎకరాల్లో) చెరకును పండించడానికి ఏడాదికి కనీసం మూడు కోట్ల లీటర్ల నీరు అవసరం. ఇది ఏడాదిలో సుమారు వెయ్యి మంది నీటి అవసరాలను తీర్చుతుంది. చెరకు పండిస్తున్న ప్రదేశాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రతిరోజు టీ తాగడం, వారానికోసారి మిఠాయి తినడం వల్ల అంతగా నష్టమేం ఉండదు. అసలు సమస్య ప్యాక్ చేసిన పదార్థాలను తీసుకోవడం వల్లనే. వాటిలో ఎంత మోతాదులో చక్కెర ఉందో మనకు తెలియ దు. పండ్లరసాలు, అల్పాహారం, ఆరోగ్యకరమైన పానీయాలంటూ ప్రచారం చేస్తున్న వాటిలో ఎక్కు వగా ఉండేది చక్కెరే.ఇలాంటి ప్రకటనలను నియం త్రించడానికి ప్రభుత్వాలు కృషిచేయాలి. దేశంలో చక్కెర డిమాండ్ 2.5 కోట్ల టన్నులు కాగా, ఉత్పత్తి అవుతున్నది 3.5 కోట్ల టన్నులు. డిమాండ్ తక్కువగా ఉన్నా ఉత్పత్తిని తగ్గించే బదులు, ప్రకటనల ద్వారా ఆకర్షించి డిమాండ్ పెంచేందుకు కంపెనీలు మార్కెటింగ్ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ఆహార, పానీయాల మార్కెటింగ్ను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవాలి. నాణ్యతా పరీక్షలు నిర్వహించాలి. కంపెనీలు తమంతట తామే తమ ఉత్పత్తులను ఆరోగ్యకరమైనవిగా ప్రచారం చేసుకోవటాన్ని నిషేధించా లి. చెరకు రైతులను ఇతర పంటలు వేసేలా ప్రోత్సహించాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. చక్కెర బదులు తేనె, బెల్లం వాడాలి. చక్కెర వినియోగా నికి ఓ పరిమితిని విధించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.
మహమ్మద్ ఆరిఫ్
96184 00190