చేగుంట : ఆరు నెలలుగా గణితం( Mathematics teacher) అధ్యాపకురాలు రావడం లేదని దీంతో చదువులో వెనుకబడుతున్నామని మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎస్టీ( ST) గిరిజన స్పోర్ట్స్ గురుకుల కళాశాల విద్యార్థినులు సోమవారం రోడ్డుపై బైటాయించి నిరసన (Students Protest ) తెలిపారు. కళాశాలలో మొదటి సంవత్సరంలో 33 మంది, రెండవ సంవత్సరంలో 29 మంది విద్యార్థులు విద్యాభ్యాసం పొందుతున్నారని విద్యార్థినిలు వివరించారు.
రెండో సంవత్సరం చదువుతున్న తమకు ఆరు నెలలుగా లెక్చరర్ లేక గణితం బోధించడం లేదన్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఎస్టీ స్పోర్ట్స్ గురుకుల పాఠశాలకు గణిత అధ్యాపకురాలని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్ సుమతి వివరణ ఇచ్చారు. నాలుగు నెలల క్రితం చేగుంటలో పనిచేసిన గణితము అధ్యాపకురాలు భద్రాచలం గురుకుల పాఠశాలకు బదిలీపై వెళ్లిందని అప్పటి నుంచి గణితం అధ్యాపకులు పోస్టు ఖాళీగా ఉండటంతో ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కొండ మల్లయ్యపల్లి నుంచి బదిలీపై వచ్చి గణిత ఉపాధ్యాయులు జాయినింగ్ అవుతున్నట్లు ప్రిన్సిపల్ సుమతి తెలిపారు.